గతేడాది మార్చిలో ప్రారంభమైన కరోనా వ్యాప్తి.. కొత్తకొత్త రూపాల్లో రూపాంతరం చెందుతోంది. గతేడాది కొద్దిపాటి లక్షణాలను ఈ వైరస్ సోకిందనటానికి పరిగణలోకి తీసుకొనేవారు. ఈ ఏడాది సెకండ్వేవ్లో మరికొన్ని లక్షణాలు కలిశాయి. ఇప్పటి వరకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, జలుబు, వాసనతో పాటు రుచి తెలియకపోవడం కొందరిలో కళ్లు ఎర్రబారడం వంటివి కరోనా లక్షణాలుగా గుర్తించారు. ఈ లక్షణాలు ఉన్నవారు టెస్టులు చేయించుకొనేందుకు కొవిడ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. తాజాగా వైద్యులు మరికొన్ని లక్షణాలను గుర్తించారు. ఈ కొత్త లక్షణాలు ఉండటం వల్ల కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు అనుమానించాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.
కొవిడ్ సోకిన వారిలో తాజాగా నోరు ఎండిపోవడం, నాలుకపై గాయాలు, నాలుక దురద, మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ కరోనా కొత్త లక్షణాలను కొవిడ్ టంగ్గా పిలుస్తున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారిలో ఎక్కువగా నీరసంతో పాటు విపరీతమైన అలసట ఉంటుందట. ఈ రెండు లక్షణాలు ఉన్నవారికి వైద్యులు పలు విధాలుగా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలిందట. అయితే ఈ లక్షణాలపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలు లేకపోయినా అనుమానం వస్తే వెంటనే కరోనా టెస్టు చేయించుకోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.