ఏపీలో శనివారం బ్లాక్ ఫంగస్ తో ముగ్గురు మృతి చెందారు. గుంటూరుకు చెందిన యువకుడు(30), కర్నూలుకు చెందిన వృద్ధుడు(60) కర్నూలు సర్వజన ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆ తర్వాత బ్లాక్ఫంగస్ లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరగా.. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో యువకుడు శుక్రవారం, వృద్ధుడు శనివారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కర్నూలు నగరానికి చెందిన మరో యువకుడు కూడా బ్లాక్ ఫంగస్ బారిన పడ్డాడు. అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు శనివారం మృతిచెందినట్లు సమాచారం. రెండు రోజుల కిందటే ఆ యువకుడి తండ్రి కరోనాతో మృతిచెందారు.
ఇక గుంటూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 20 రోజుల కిందట కరోనా పాజిటివ్ గా తేలింది. చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు. కానీ కరోనా నుంచి కోలుకున్న 2 రోజులకు అతడిలో బ్లాక్ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడిని చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. వ్యాధి ముదిరి ఫంగస్ కంటికి సోకడంతో శనివారం అతనికి శస్త్రచికిత్స చేసి కనుగుడ్డు తొలగించారు.
శ్రీకాకుళం జిల్లాలోనూ ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బ్లాక్ఫంగస్ వ్యాధి బారిన పడ్డారు. నరసన్నపేట మండలం దాసరివానిపేట గ్రామానికి రామకృష్ణకు ఏప్రిల్ 3న కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయనకు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో వారం రోజులు చికిత్స అందించారు. అనంతరం అతడు కోలుకుని గత నెల 14న డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం కొద్ది రోజులకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్ అందించేప్పుడు స్టెరైల్ నీటికి బదులు సాధారణ నీటిని హ్యుమిడిఫయర్ (తేమ అందించే పరికరం) ద్వారా అందించడమే బ్లాక్ ఫంగస్ కు కారణం అవుతోందని నిపుణులు చెబుతున్నారు. హ్యుమిడిఫయర్లేలో స్టెరైల్ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు, ఐసోలేషన్ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారు సాధారణ నల్లా నీటిని ఉపయోగిస్తున్నారు. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. వాటి దుష్పభ్రావాల కారణంగా మ్యూకోర్ మైకోసిస్ దాడి చేస్తోంది. కళ్లు, ముక్కు, మెదడు, పళ్లపై ప్రభావం చూపుతోంది.