సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లోనే దిట్ట అని అనుకుంటే పొరపాటే. కేసీఆర్ అమలు చేసే పథకాలు అందరికి ఉపయోగకరంగా, మంచి పలితాలు రాబట్టేలా ఉంటాయి. అందుకే రాష్ట్రంలో ఏ కొత్త పథకం అమల్లోకి వచ్చినా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. కోవిడ్ కట్టడి విషయంలోనూ కేసీఆర్ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాది కరోనా తొలివేవ్లో కంటైన్మెంట్ జోన్ విధానంలో తెలంగాణ మొదటి అడుగు వేస్తే దేశంమొత్తం అదే అమలైన విషయం విధితమే. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు సీఎం పదిరోజుల పాటు లాక్డౌన్ విధించారు. మరోవైపు కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే ముందు కొవిడ్ ఎవరెవరికి సోకింది అనేది గుర్తించాలని భావించిన కేసీఆర్.. ఆ మేరకు ఫీవర్ సర్వేను తెరపైకి తెచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే జోరుగా సాగుతుంది. పట్టణం, గ్రామం అనే తేడాలేకుండా ప్రత్యేక బృందాలు గ్రామంలోని ప్రతీఇంటికి వెళ్లి ఇంటిల్లిపాదికి కొవిడ్ టెస్టు నిర్వహిస్తున్నారు. వారిలో కోవిడ్ లక్షణాలుంటే వెంటనే హోం ఐసోలేషన్ సూచిస్తు, కొవిడ్ కిట్లను అందిస్తున్నారు. దీంతో కొవిడ్ సోకిన వ్యక్తి బయటకురాకుండా ఉండటం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసినవాళ్లమవుతామని కేసీఆర్ భావించి ఫీవర్ సర్వేను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే తెలంగాణలో ఈ సర్వే చివరిదశకు చేరింది. ఈ ఫీవర్ సర్వే వివరాలను తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల సీఎంల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి ఈ విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారట. దీంతో సీఎం కేసీఆర్ ఆలోచన మరోసారి దేశం మొత్తం ఉపయోగపడుతుందని తెరాస శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.