భోపాల్: తాను ప్రతిరోజు గోమూత్రం తాగుతానని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ అన్న మాటలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇది వరకు కూడా ఓ బీజేపీ ఎంపీ ఈ తరహా మాటలే మాట్లాడారు. గోమూత్రం సేవిస్తే కరోనా పరారవుతుందని, కరోనాకు కొత్త మందులు అవసరం లేదని ఆయన అన్నారు. ఇప్పుడు అటువంటి మాటలనే ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కూడా పలికారు. పార్టీ గాథరింగ్ సమావేశంలో పాల్గొన్న ప్రగ్యా ఠాకూర్ తాను రోజు గోమూత్రం సేవిస్తానని చెప్పారు. ‘నేను రోజూ గోమూత్రం తాగుతాను, అందుకనే కరోనా ఔషధం తీసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. గోమూత్రంతో ఎన్నో లాభాలు ఉన్నాయి. దాని కారణంగా ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి, రక్తంలో చేరిన మలినాలు బయటకు తోసివేయబడతాయ’ని ప్రగ్యా ఠాకూర్ అన్నారు.

 అంతేకాకుండా గోమూత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంజీవని అని, దీనిని సేవించడం ద్వారా అనేక రోగాలకు చెక్ చెప్పవచ్చని ఆమె తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం గోమూత్రంతో పాటు గోవు నుండి వచ్చే ఇతర పథార్దాలతో తన క్యాన్సర్ కూడా తగ్గిందని ఆమె అన్నారు. అయితే ఆమె గతేడాది డిసెంబరులో కరోనా లక్షణాలతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుకున్నారు.

అయితే వైద్యులు మాత్రం ఇటువంటి మాటలు నమ్మవద్దని, గోమూత్రం తీసుకోవడంతో కరోనాను అరికట్టడం కుదరదని అన్నారు. అంతేకాకుండా దానిని నిరూపించేవిధంగా ఎటువంటి రుజువులు లేవని కూడా వైద్యులు తెలిపారు. అంతేకాకుండా గోమూత్రం రోగనిరోధక శక్తిని పెంచుతుందని కూడా ఎటువంటి ఆధారాలు లేవని ఆరోగ్య అధికారులు అన్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్‌లోని బీజేపీ ఎమ్మల్యే సురేంధర్ సింగ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. గోమూత్రాన్ని ఓ గ్లాసు నీళ్లతో సేవిస్తే కరోనా నుంచి కాపాడుతుందని ఆయన అన్నారు. అయితే ఇటువంటి వాటిని నమ్మవద్దని, దేశంలో కరోనాను అడ్డుకునేందుకు పలు ఔషధాలు, టీకాలు అందబాటులో ఉన్నాయని, వింత ప్రయోగాలు చేయడం ద్వారా మీ ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: