అయితే మహరాష్ట్రలో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, దీని బారిన పడిన వారికి చికిత్స చేయడానికి కావలసిన వెంటిలేటర్లు కూడా అందుబాటులో లేవని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్ తెలిపారు. అయితే ఇటీవల రాష్ట్రానికి పీఎం కేర్స్ నుంచి పెద్ద సంఖ్యలో వెంటిలేటర్లు వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా వాటి పంపిణీ విషయంలో ఎటువంటి రాజకీయాలు చేయొద్దని, స్వలాభం పొందేందుకు అమాయకపు ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ఆయన సూచించారు.
అయితే ఈ వెంటిలేటర్లు వచ్చిన నాలుగు నెలల వరకు అందుబాటులోకి రాలేదు. దాంతో రాష్ట్రానికి వచ్చిన 5 వేల వెంటిలేటర్లను సరిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. దాంతో పాటుగా ప్రజల బాధను గుర్తించాలని, కరోనా బాధితులకు కావలసిన వైద్య సదుపాయాల విషయంలో ఎటువంటి రాజకీయం చేయొద్దని, ప్రతి ఒక్కరికీ అన్ని సమానంగా అందేలా చూడాలని అన్నారు. ఇప్పటి వరకు కరోనా చికిత్స విషయంలో అనేక రాజకీయాలు చేశారని, కానీ ఇకపై అవి చెల్లుబాటు కావని ఫడ్నవీస్ రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో గత 24 గంటల్లో 34,389 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 53.8 లక్షలకు చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో 974 మంది మరణించగా మరణాల సంఖ్య 81,486కు చేరింది. అంతేకాకుండా రాష్ట్రంటో 24 గంటల్లో 59,318 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మహరాష్ట్రలో కేసులను అరికట్టేందుకు లాక్డౌన్ను విధించారు.