ముఖ్యంగా ప్రభుత్వాదేశాల మేరకు సీఐడీ అధికారులు తనను బలవంతంగా జైలుకు పంపాలని చేసిన ప్రయత్నాలను తాను విజయవంతంగా అడ్డుకోగలిగానన్న ఉద్దేశంతోనే ఆయనిలా మీసం తిప్పి ఉంటారని పలువురు అంటున్నారు. ప్రభుత్వం తనపై కక్ష తీర్చుకోవాలని అనుసరించిన వైఖరి బెడిసికొట్టడంతో నైతికంగా తాను విజయం సాధించానని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం అయి ఉంటుందని నాయకులు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరచే కుట్రకు పాల్పడుతున్నారంటూ ఎంపీ రఘురామరాజును రెండు రోజుల క్రితం ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లో ని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చట్టవిరుద్దంగా సాగుతున్నాయంటూ రాజు కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సోమవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను వెంటనే సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని, ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా అత్యున్నత స్థానం సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కొంతకాలంగా కొరకరాని కొయ్యగా మారిన సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు వ్యవహారం.. ఇంకా ఎన్ని ఆసక్తికరమైన మలుపులకు, సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.