వైసీపీకి అన్నీ ఉన్నా ఇంటి పోరు మాత్రం తప్పడంలేదు. సొంత పార్టీ మనిషే బయటకు వచ్చి చేస్తున్న విమర్శలు ఆ పార్టీ అసలు తట్టుకోలేకపోతోంది. ఆయన మాకు వద్దు అని అనుకుంటోంది. ఆయన్ని రెబెల్ గా గుర్తించింది. అందుకే ఆయన మీద సీరియస్ యాక్షన్ కావాలని ఏడాది గా పోరాడుతోంది.

వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలంటూ మరోసారి స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ వినతి చేసింది. ఈసారి చీఫ్ విప్ హోదాలో రాజమండ్రికి చెందిన ఎంపీ మార్గాని భరత్ వినతిపత్రం అందించారు. ఆయన పార్టీ లైన్ దాటారని,అందువల్ల ఫిరాయింపుల నిరోధక చట్టం షెడ్యూల్ 10 ప్రకారం లోక్ సభ సభ్యునిగా అనర్హుడిని చేయాలని భరత్ అందులో విన్నవించుకున్నారు.

ఇక రాజు పార్టీ మీద అదే పనిగా చేస్తున్న విమర్శలను కూడా ఆయన స్పీకర్ దృష్టికి  తెచ్చారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే గత ఏడాది కూడా ఇదే విధంగా రాజు మీద వైసీపీ ఎంపీలు అంతా స్పీకర్ ని కలసి ఫిర్యాదు చేశారు. నాడు చాలా పెద్ద నాయకులే వెళ్లారు. కానీ ఏడాది గడచింది కానీ నో యాక్షన్. ఇపుడు జగన్ ఇలా ఢిల్లీ టూర్ పూర్తి చేసుకుని ఏపీకి వచ్చారో లేదో అలా మరో సారి విన్నపం స్పీకర్ కి వెళ్ళింది.

అయితే ఇది అనుకున్నత ఈజీగా జరిగే వ్యవహారం కాదని అంటున్నారు. దీని మీద స్పీకర్ అన్నీ చూస్తారు. ఆయన మీద వైసీపీ చేసిన ఫిర్యాదులను పరిశీలించి సంతృప్తి చెందితే మాత్రం అపుడు రాజుని పిలిచి వివరణ కోరుతారు. ఆయన వివరణకు కూడా టైమ్ ఇస్తారు. ఆయన వివరణ మీద స్పీకర్ సంతృప్తి చెంది ఫిరాయింపుల చట్టానికి అది వర్తించకపోతే చర్యలు తీసుకోలేరు. అలా కాకుండా యాక్ట్ అట్రాక్ట్ అయితేనే అనర్హత వేటు పడుతుంది.

ఇక్కడ ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది అంటే పార్టీ ఏదైనా విప్ జారీ చేస్తే ధిక్కరిస్తే ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడుతుంది. అలాగే పార్టీ ఆదేశాలను బహిరంగంగా ధిక్కరించారు అన్నా కూడా చట్టం వర్తిస్తుంది. కానీ రాజు విప్ ని ఎపుడూ కాదనలేదు. అలాగే ఆయన విమర్శలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఒక సభ్యుడిగా తన హక్కు అంటున్నారు. మరి దీని మీద పార్టీ వ్యతిరేక చర్యలు అని వైసీపీ అంటోంది. ఇది ఎంతమేరకు వర్తిస్తుందో చూడాలి. ఏది ఏమైనా స్పీకర్ చేతిలో ఈ విషయం ఉంది. ఆయన్ని మాజీ చేయడం అంటే అనుకున్నంత ఈజీ కాదని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: