టీడీపీతో పొత్తు విడిపోయిన దగ్గర నుంచి ఏపీ బీజేపీ నేతలు, చంద్రబాబుని ఏ రేంజ్‌లో టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో తాము గెలవకపోయినా పర్లేదు..కానీ చంద్రబాబుని చిత్తుగా ఓడించడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది. అనూహ్యంగా టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. భారీగా సీట్లు దక్కించుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీకి ఒక్కశాతం ఓట్లు కూడా రాలేదు.


అయితే ఒక్కశాతం ఓట్లు కూడా రాకపోయిన సరే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావడంతో ఏపీలో బీజేపీ నేతలు ఎక్కడ ఆగలేదు. మొదట్లో వరుసపెట్టి పలువురు టీడీపీ నేతలని పార్టీలోకి చేర్చుకుని హడావిడి చేసింది. ఇక టీడీపీ పని అయిపోయింది...టీడీపీ స్థానం తమకే దక్కుతుందని, వైసీపీకి తామే పోటీ అని, ఏపీలో అసలైన ప్రతిపక్షం తమ పార్టీనే అని బీజేపీ నేతలు ఉపన్యాసాలు ఇచ్చారు.


కానీ ఎన్నికలై ఇప్పటికీ రెండేళ్ళు అయింది. ఈ రెండేళ్లలో బీజేపీ బలం ఏమన్నా పెరిగిందా? అంటే అబ్బే బీజేపీ విషయంలో ఏపీ ప్రజలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. ఏపీ ప్రజలు బీజేపీని ఆదరించే పరిస్తితి లేదని తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇంకా గొప్పలు చెప్పుకుంటూనే ఉంది. పవన్ కల్యాణ్‌తో జట్టు కట్టి తమ బలం పెరిగిపోయిందని చెప్పుకుంటుంది.


అసలు బీజేపీతో కలవడం వల్ల పవన్ కల్యాణ్‌కే ఇంకా డ్యామేజ్ జరిగినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన 6-7 శాతం ఓట్లు తెచ్చుకుంది. కానీ ఆ పార్టీ ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో నామమాత్రం సీట్లు కూడా గెలవలేదు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు ఏ మాత్రం ఉనికి చాటుకోలేకపోయాయి. ఈ రెండు పార్టీలకు కలిపి 5 శాతం ఓట్లు కూడా రాలేదు. మరి దీని బట్టి చూసుకుంటే ఏపీలో బీజేపీ సత్తా చాటడం కష్టం. టీడీపీ స్థానంలోకి అసలు రాలేదు. అలాగే పవన్ కల్యాణ్, బీజేపీని వదిలేసి బయటకొచ్చేస్తేనే బెటర్ అనే కామెంట్లు వస్తున్నాయి. మరి చూడాలి రానున్న రోజుల్లో పవన్, బీజేపీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి: