వాహనాలు నడపటానికి అవసరమైన అనుమతులన్నీ ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. జులై ఒకటోతేదీ నుంచి డ్రైవింగ్ పరీక్ష లేకుండానే లైసెన్స్ ఇవ్వనున్నారు. అక్రిడేటెడ్ శిక్షణ కేంద్రాల్లో డ్రైవింగ్ కోసం ప్రత్యేక ట్రాక్ తప్పనిసరి చేసింది. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే వీరికి మళ్లీ డ్రైవింగ్ పరీక్ష ఉండదు. అంటే అక్రిడేటెడ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకున్నారికి వెంటనే లైసెన్స్ లభించనుంది. ఈమేరకు కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీచేసింది.ఈ కేంద్రాల్లో పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడానికి అనుమతులు మంజూరు చేయనుంది.
ఇంటర్నెట్ సౌకర్యం కచ్చితంగా ఉండాలి
కేంద్రం కొత్తగా రూపొందించిన విధానాల ప్రకారం టూవీలర్, త్రీవీలర్, తేలికపాటి వాహనాల డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వాలంటే
కనీసం ఎకరం స్థలం ఉండాలి. వీటితోపాటు ప్యాసింజర్, సరుకు రవాణా వాహనాలు, ట్రెయిలర్స్ నడపడానికి శిక్షణ ఇవ్వాలనుకుంటే కనీసం రెండెకరాల స్థలం ఉండాలి. శిక్షణ తరగతుల కోసం సిమ్యులేటర్స్ను వాడాలి. ఇంటర్నెట్ సౌకర్యం కచ్చితంగా ఉండాలి. పార్కింగ్, రివర్స్, ఎగుడు దిగుళ్లలో వాహనం నడిపేందుకు అవసరమైన ట్రాక్లు ఏర్పాటు చేసుకోవాలి. శిక్షణ ఇచ్చే అన్ని వాహనాలకు బీమా సౌకర్యం తప్పనిసరి. రెండు తరగతి గదులుండాలి. థియరీ తరగతులు, ట్రాఫిక్ నిబంధనలు, డ్రైవింగ్ ప్రక్రియ, వాహన మెకానిజం, ప్రజాసంబంధాలు, ప్రాథమిక చికిత్స విషయాలపై పాఠాలు చెప్పేందుకు కంప్యూటర్, మల్టీ మీడియా ప్రొజెక్టర్ ఉపయోగించాలి.
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
నాణ్యత కలిగిన శిక్షకులు, ఎలక్ట్రానిక్ పేమెంట్ సౌకర్యం, బయోమెట్రిక్ తరహా హాజరు ఉండాలి. శిక్షణ ఇచ్చేవారు కనీసం 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండటంతోపాటు డ్రైవింగ్లో కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిక్స్లో ప్రొఫిషియన్సీ పరీక్షకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం ఉండాలి. అక్రిడిటేషన్ ఒకసారి మంజూరు చేస్తే ఐదు సంవత్సరాలు అమల్లో ఉంటుంది. అలాగే గడువు ముగియడానికి రెండు నెలల ముందుగా రెన్యువల్ చేసుకోవాలి.