మొదట విశాఖలో మాజీ మంత్రి సబ్బంహరికి సంబంధించి భూములను జీవీఎంసీ అశధికారులు స్వాధీనం చేసుకున్నారు.రెండు మూడు సార్లు సబ్బంహరి ఇంటి ప్రహరీ గోడను కూల్చేశారు.ఆ తరువాత సబ్బంహరి కరోనాతో చనిపోవడంతో ఇప్పుడు వైసీపీ మరో నేతను టార్గెట్ చేసింది. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి సంబంధించిన భూములపై వైసీపీ నేతలు దృష్టి సారించారు. పల్లా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విశాఖలో భూములు కబ్జా చేశారని వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు ఆరోపిస్తున్నారు.అయితే వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండిస్తున్నారు.
విశాఖలో తనకు 750 కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నట్లు వైసీసీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.49 ఎకరాలు తన ఆధీనంలో ఉందని విజయసాయిరెడ్డి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని..నిరూపించలేకపోతే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిపోతారా అని పల్లా శ్రీనివాస్ సవాల్ విసిరారు.తాను పార్టీ మారలేదనే కక్షతోనా...లేదా స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేశాననే అక్కసుతో చేస్తున్నారో తనకు అర్థంకావడంలేదన్నారు.డబ్బులు సంపాదించడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని..చచ్చేంతవరకు టీడీపీలోనే ఉంటాను తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదని పల్లా శ్రీనివాస్ తేల్చి చెప్పారు.మంత్రి అవంతి శ్రీనివాస్ తెలుసుకుని మాట్లాడితే బాగుంటదని...సాయిరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్నే అవంతి చదువుతున్నారన్నారు.తనపై ఆరోపణలు చేసిన మంత్రులు,ఎమ్మెల్యేలు దమ్ముంటే చర్చకు వచ్చి..అన్యాక్రాంతం చేసిన భూములను చూపించాలని పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
మొత్తానికి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి.ఒకరి తరువాత ఒకరిని వైసీపీ టార్గెట్ చేయడంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.