ఈనాడు అధినేత రామోజీ రావుకు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు మధ్య పెద్దగా సంబంధాలు లేని విషయం తెలిసిందే. ఒకవేళ ఉన్నా.. అప్పటికప్పుడు ఉన్న అవసరాల నేపథ్యంలో ఇద్దరూ సర్దుకు పోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. పాదయాత్ర సమయంలో తన వార్తలను కవర్ చేయాలంటూ.. జగన్ స్వయంగా రామోజీని కలిసి అభ్యర్థించినా.. అది అప్పటికే సరిపోయింది. ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఈనాడు వ్యవహారం.. టీడీపీకి అనుకూలంగా మారిపోయింది.
అయితే.. రాష్ట్రంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చారు. దీంతో టీడీపీని సమర్ధించే ఈనాడు కొంతమేరకు పంథాను మార్చుకుంది. ప్రభుత్వ వార్తలకు ప్రాధాన్యం ఇస్తూ.. వచ్చింది. అయితే..కొన్నాళ్లుగా మళ్లీ రామోజీ తన పంథాను మార్చుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ ఇబ్బందికర పరిస్థితిలో ఉండడంతో మళ్లీ ఆ పార్టీని ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారని.. ఇటీవల చంద్రబాబు రహస్యంగా రామోజీ తో చర్చలు జరిపారని ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది.
ఇది జరిగిన వెంటనే ఈనాడు, దాని అనుబంధ మీడియా సంస్థలు పంథాను మార్చుకున్నాయి. జగన్ వార్తలకు, ప్రభుత్వ వార్తలకు ప్రాధాన్యం తగ్గించడంతోపాటు.. ఈటీవీ సహా అన్ని ఛానెళ్లలోనూ తెలంగాణ వార్తలకు ప్రాధాన్యం పెంచడాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు కూడా ఏదో జరిగిందనే అనుమానాలకు తావిచ్చేలా ఉంది.
అయితే జగన్ ప్రభుత్వం అమలు చేసే పథకాల ప్రకటనలని ఈనాడుకు ఇస్తూనే ఉంది. అయినా సరే రామోజీరావు పెద్దగా జగన్ ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఏదో రెగ్యులర్ వార్తలు వరకే పరిమితమయ్యారు తప్ప, వైసీపీని భుజాన వేసుకునే పని చేయడం లేదు. అదే సమయంలో టీడీపీని మాత్రం కాస్త పైకి లేపే కార్యక్రమం చేస్తున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు హవా పెరిగేందుకు టీడీపీ మద్దతు మీడియా ప్రత్యేక వ్యూహాలను అనుసరించాలని నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామోజీ మరోసారి తన పంథా మార్చుకున్నారని అంటున్నారు.