అంటే జగన్ కూడా కొన్ని హామీల విషయంలో మాట తప్పారనే విషయాన్ని హైలైట్ చేయాలని రఘురామ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెన్షన్ పెంపు విషయంలో జగన్ మాట తప్పారని, వెంటనే మాట నిలబెట్టుకోవాలని లేఖ రాశారు. అలాగే అధికారంలోకి వచ్చిన వారం లోపే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి, ఇంతవరకు దాన్ని పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఇక ప్రతి ఏడాది ఉద్యోగాల క్యాలెండర్ ఇస్తానని చెప్పి మాట తప్పారని లేఖలో చెప్పారు.
అలాగే పెళ్లి కానుక, షాదీ ముబారక్, అగ్రిగోల్డ్ భాదితులకు న్యాయం చేయాలని వరుసపెట్టి జగన్కు లేఖలు రాశారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏ, పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఇలా వరుసపెట్టి లేఖలు రాస్తున్న రఘురామ తాజాగా జగన్ మరో హామీలో మాట తప్పారని లేఖ రాశారు.
ఎన్నికల ముందు ప్రతి రైతుకు రూ. 12,500 రైతుభరోసా పథకం కింద ఇస్తానని జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇచ్చే రూ. 6 వేలుతో కలుపుకుని మొత్తం రూ. 13,500 రైతులకు ఇస్తున్నారు. అంటే ఇందులో రాష్ట్రం ఇచ్చేది రూ. 7,500 మాత్రమే. జగన్ హామీ ఇచ్చినప్పుడు కేంద్ర పథకంతో కలిపి అని చెప్పలేదు. జగన్ హామీ ఇచ్చినప్పుడు కేంద్ర పథకం ఇంకా అమలు కూడా కావడం లేదు.
కానీ అధికారంలోకి వచ్చాక కేంద్ర పథకంతో కలిపే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రం రూ. 13,500 ఇవ్వాలని, కేంద్రం ఇచ్చే 6 వేలుతో కలిపి మొత్తం రూ. 19,500 ఇవ్వాలని రఘురామ డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే రైతుభరోసా విషయంలో జగన్ మాట తప్పినట్లే కనిపిస్తోంది. ఇక అదే విషయాన్ని రఘురామ హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.