వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జ్యుడీషియల్ రిమాండ్‌ను సీఐడీ కోర్టు ఈనెల 25 వరకూ పొడిగించింది.. అవును.. మీరు చదువుతున్నది నిజమే. అక్షరాలా నిజమే. అదేంటి.. మరి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు కదా. దర్జాగా ఢిల్లీకి ఎగిరి వెళ్లిపోయి.. సీఎం జగన్‌కు రోజుకో ప్రేమలేఖ రాస్తున్నారు కదా అంటారా.. అదీ నిజమే.. ఆయన కులాసాగా ఢిల్లీలో ఉన్నదీ నిజమే. ఇక్కడ రఘురామ కృష్ణంరాజు జ్యుడీషియల్ రిమాండ్‌ను సీఐడీ కోర్టు ఈనెల 25 వరకూ పొడిగించిందీ నిజమే.

మరి ఇలా రెండు నిజాలు ఎలా సాధ్యపడతాయి అంటారా.. అదే అసలు కథ. ప్రస్తుతం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలోనే ఉన్నారు. కానీ.. ఇక్కడ సీఐడీ కోర్టులో ఓ టెక్నికల్ సమస్య వచ్చిపడింది. రఘురామకృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది నిజమే. అయితే దీనికి కొన్ని పూచీకత్తు షరతులు ఉన్నాయి. సుప్రీం ఆదేశాలపై గత నెల 28న రఘురామ తరపున ఇద్దరు పూచీకత్తు సమర్పించారు.

ఇక్కడే చిన్న పొరపాటు జరిగింది. ఆ బెయిల్ బాండ్ షూరిటీల మీద ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంతకాలు కూడా ఉండాలి. కానీ.. అప్పుడు ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో ఉన్నందున సంతకం చేయలేదు. పోలీసులు కూడా రఘురామ సంతకాలు తీసుకోలేదు. ఇప్పుడు స్క్రూటినీలో ఆ విషయం బయటపడింది. రఘురామ సంతకాలు లేకుండానే రిమాండ్ వారెంట్ జిల్లా జైలు వద్ద పెండింగ్ లో ఉండిపోయింది.

నిబంధనల ప్రకారం ఇలా జరగకూడదని సిఐడి కోర్టు చెబుతోంది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంతకం లేనందువల్ల ఆయన జుడిషియల్ కస్టడీ నుంచి అసలు విడుదల అయినట్టు తాము భావించలేమని సీఐడీ కోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఈనెల 11న సిఐడి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిందట. ఇప్పుడు ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr