టీడీపీ ఆవిర్భావించిన మొదట్లో ఏజెన్సీ ప్రాంతాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉండేవి. ఎప్పుడైతే వైఎస్సార్ లీడ్ తీసుకున్నారో, అప్పటినుంచి ఏజెన్సీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వైసీపీ హవా కొనసాగుతుంది. భవిష్యత్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో టీడీపీ నిలబడటం కష్టమే అని తెలుస్తోంది. ముఖ్యంగా అరకు పార్లమెంట్ పరిధిలో టీడీపీ పరిస్తితి ఘోరంగా ఉంది. వైసీపీకి కడప జిల్లా ఎంత అనుకూలంగా ఉందో అరకు కూడా అంతే అనుకూలంగా ఉంది.
అరకు పార్లమెంట్ పరిధిలో.. రంపచోడవరం, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికల్లో ఈ పార్లమెంట్లో వైసీపీనే సత్తా చాటింది. ఒక్క పార్వతీపురం మినహా మిగిలిన అన్నీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. అటు అరకు పార్లమెంట్లో కూడా వైసీపీ గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. మొత్తం వైసీపీ క్లీన్స్వీప్ చేసింది.
అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటుతున్న కూడా అరకులో వైసీపీ బలం తగ్గలేదు. అలాగే టీడీపీ బలం పెరగలేదు. ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ వీక్గానే ఉంది. టీడీపీ ఇన్చార్జ్లు సైతం పుంజుకోలేదు. గత ఎన్నికల్లో పాలకొండలో జయకృష్ణ నిమ్మక పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఈయన దూకుడుగా ఉండటం లేదు. దీంతో పాలకొండలో టీడీపీ బలపడలేదు.
అటు కురుపాంలో ఓడిన జనార్ధన్ థాట్రాజ్ చనిపోయారు. పార్వతీపురంలో బొబ్బిలి చిరంజీవులు పర్వాలేదనిపిస్తున్నారు. సాలూరులో టీడీపీ మరీ వీక్గా ఉంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొర హవా ఎక్కువగా ఉంది. అరకులో మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ పెద్ద యాక్టివ్గా ఉండటం లేదు. పాడేరులో గిడ్డి ఈశ్వరి అడ్రెస్ లేరు. రంపచోడవరంలో వంతల రాజేశ్వరి సైతం యాక్టివ్గా లేరు. మొత్తం మీద చూసుకుంటే అరకు పార్లమెంట్ పరిధిలో సైకిల్ బలపడలేదు. భవిష్యత్లో కూడా అరకులో సైకిల్ నిలబడటం కష్టమే.