ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వమే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరించింది. ఈ క్రమంలోనే మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేస్తుంది. ఇలా రైతుబంధు ద్వారా ప్రతి ఎకరాకి ఐదు వేల రూపాయలు పొందుతున్న రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఇప్పటివరకు రైతుబంధు వచ్చిన సమయంలో రైతులు బ్యాంకు కి వెళ్లి డబ్బులు తీసుకునే వారు. ఇక నుంచి పోస్ట్ ఆఫీస్ లో కూడా రైతుబంధు డబ్బులు తీసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగానే ఈ సేవలను అందిస్తున్నట్లు ఇటీవల తపాలా శాఖ అధికారులు ప్రకటించారు.
ఇక ఈ సేవల కారణంగా రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రైతులందరికీ రైతు బంధు అందించేందుకు పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు ఉంచబోతున్నాము అంటూ తపాల శాఖ అధికారులు తెలిపారు. ఇక తద్వారా రైతులకు మైక్రో ఎటిఎంల ద్వారా రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. రాష్ట్రంలో 5794 పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తో లింక్ అయి ఉన్న రైతులు ఇక ప్రతిరోజు గరిష్టంగా 10 వేల రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ తపాలా శాఖ అధికారులు తెలిపారు.