మన దేశంలో గత 24 గంటల్లో 60,753 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ శనివారం వివరాలు వెల్లడించింది. ఈ లెక్కలను బట్టి చూస్తే దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,60,019గా ఉంది. గత 24 గంటల్లో మరో 1,647 మంది కోవిడ్తో మరణించడంతో ఇప్పటి వరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 3,85,137కు పెరిగింది.
ఇక దేశంలో రికవరీ రేటు 96.16 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 1.29 శాతంగా, పాజిటివిటీ రేటు 2.98 శాతంగా ఉందని లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే అనధికారికంగా వెల్లడి కాని కరోనా లెక్కలు కాని.. కరోనా మరణాలు చాలానే ఉన్నాయి. వీటి సంగతి ఏంటన్నదానిపై ఎవ్వరూ మాట్లాడడం లేదు. మరోవైపు దేశంలో త్వరలోనే థర్డ్ వేవ్ వస్తుందని.. అందుకే దేశం అంతా సిద్ధంగా ఉండాలని నిపుణులు చెపుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని, రాబోయే 6 నుంచి 8 వారాల్లో సంక్రమణ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్వయంగా హెచ్చరించారు.
తొలి వేవ్ తర్వాత ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీంతో కరోనా తీవ్రమైంది. సెకండ్ వేవ్ దెబ్బకు దేశం ఎంతో మందిని కోల్పోయింది. సామాన్యుల నుంచి మేథావుల వరకు ఎంతో మంది చనిపోయారు. మరి ఇప్పుడు కరోనా తగ్గిపోయిందని మళ్లీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కన్నా జాగ్రత్తగా ఉండడంతో పాటు ఇప్పటి నుంచే మూడో వేవ్ను ఎలా కంట్రోల్ చేయాలన్న దానిపై ప్లానింగ్ లేకపోతే మళ్లీ కరోనా విజృంభిస్తే ఈ సారి జరిగే నష్టం ఊహించడం ఎవ్వరి వల్లా కాదు.