ఇదే అంశంపై తెలంగాణ కేబినెట్లో సుధీర్ఘంగానే చర్చించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం- 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా... సుప్రీం కోర్టులో కేసు కారణంగా సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయలేకపోతున్నామని చెప్పింది. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల పాలమూరు, నలగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందదని తెలంగాణ కేబినెట్ స్పష్టం చేసింది.
ఇక ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో పలు జిల్లాలకు సాగు నీరు అందక పోవడంతో పాటు హైద్రాబాద్ కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని కేబినెట్ లో చర్చించారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటి వాటాను దక్కించుకోవడానికి పోరాటం చేసే విషయంలో ఎంతకైనా వెళ్లాలని కూడా ఇక్కడ తీర్మానించారు. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వ వైఖరి చూస్తే ఏపీ ప్రభుత్వంతో నీటి యుద్ధం చేసే విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోనుంది. మరి ఇది రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింతగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు.