దివంగత మండలి వెంకటకృష్ణారావు... దివిసీమ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. పేదవర్గాలకు ఆపద్భాందువుడుగా పేరు తెచ్చుకున్న మండలి దశాబ్దాల పాటు కాంగ్రెస్లో రాజకీయాలు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గం వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన వెంటనే జరిగిన 1983 ఎన్నికల్లో సైతం అవనిగడ్డలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేశారు. ఇక కృష్ణారావు తర్వాత, అవనిగడ్డలో ఆయన వారసుడు బుద్దప్రసాద్ సత్తా చాటారు.
1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఓడిపోయిన బుద్దప్రసాద్, రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలోకి వచ్చేశారు. 2014లో అవనిగడ్డ నుంచి మరోసారి విజయం సాధించారు. అలాగే డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున నిలబడి ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి మండలి పెద్దగా యాక్టివ్గా ఉండటం లేదు. అటు టీడీపీలో కనిపించడం తగ్గించేశారు.
మిగతా నాయకులు నిత్యం జగన్ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. కానీ మండలి మాత్రం అడ్రెస్ లేరు. అప్పుడెప్పుడో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా గళం విప్పిన బుద్దప్రసాద్, మళ్ళీ టీడీపీలో పోరాటం చేస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా వయసు మీద పడుతుండటంతో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటం తగ్గించేసినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో తన వారసుడుని నెక్స్ట్ ఎన్నికల్లోపు లైన్ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే మండలి వారసుడు వెంకట్రామ్ కాస్త అవనిగడ్డ నియోజకవర్గంలో పనిచేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది. కాకపోతే మండలి ఫ్యామిలీ రాజకీయాల్లో దూకుడుగా ఉండదు. ముందు నుంచి మండలి ఫ్యామిలీ చాలా సౌమ్యంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దూకుడు ఎక్కువ కావాలి. పైగా అపోజిట్లో ఉన్న అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్..దూకుడుగా ఉంటారు. ఇక ఆయన దూకుడుని తట్టుకోవాలంటే వెంకట్రామ్ సైతం, అదే తరహా రాజకీయాలు చేయాలి. అలా కాకుండా నిదానంగా ఉంటే, వర్కౌట్ అవ్వదు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో మండలి తన వారసుడుని సక్సెస్ చేయగలుగుతారో లేదో?