భారత్ లో ఆరేళ్ల కంటే ఎక్కువ వయసున్న 67.6శాతం మందిలో అంటే దాదాపు 80కోట్ల మందిలో యాంటీ బాడీలు ఉన్నట్టు ఐసీఎమ్ఆర్ వెల్లడించింది. యాంటీ బాడీలు ఉన్నవారికి వైరస్ సోకి ఉండవచ్చు. లేదా టీకాల వల్ల యాంటీ బాడీలు ఉత్పత్తి అయి ఉండవచ్చని తెలిపింది. ఇంకా 40కోట్ల మందికి వైరస్ ముప్పు పొంచి ఉందని చెప్పింది. 6 నుంచి 7ఏళ్ల మధ్య ఉన్న పిల్లల్లో సగం కంటే ఎక్కువ మందిలో యాంటీ బాడీలు ఉన్నట్టు గుర్తించింది.

మరోవైపు దేశంలో కరోనా మరణాలు 10రెట్లు పెరగడం కలకలం సృష్టిస్తోంది. నిన్న 374మంది చనిపోగా.. ఈ రోజు ఏకంగా 3వేల 998 మరణాలు సంభవించాయి. అటు కేసుల సంఖ్య కూడా పెరిగింది. కొత్తగా 42వేల 015కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కేసుల సంఖ్య 3కోట్ల 12లక్షల 16వేల 337కు చేరింది. మొత్తంగా 4లక్షలా 18వేల 480మంది కరోనాతో కన్నుమూశారు. మరో 36వేల 977మంది కోలుకోగా... రికవరీల సంఖ్య 3కోట్ల 3లక్షలా 90వేల 687కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4లక్షలా 7వేల 170యాక్టివ్ కేసులున్నాయి.

నిన్నటితో పోలిస్తే ఈ రోజు కరోనా మరణాలు భారీగా పెరగడానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా మృతుల లెక్కను సవరించడంతో మరణాల సంఖ్యలో భారీ తేడా కనిపించిందని తెలిపింది. మహారాష్ట్ర వెల్లడించిన మృతుల సంఖ్య 3వేల 656గా ఉందని చెప్పింది. దీంతో ఈరోజు కోవిడ్ మరణాల సంఖ్య 3వేల 998గా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తానికి ఐసీఎమ్ఆర్ ప్రకటన ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉంది. ప్రజలు కూడా మాస్క్ లు, శానిటైజర్లను తప్పనిసరిగా వినియోగించాల్సిందే. గుమిగూడిన ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: