ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరికి జిల్లా స్థాయి అధికారి ఒకరు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ ఆఫర్ వింటే సెటిలైన జీవితం కూడా మళ్లీ సెటిలవుతుందని ప్రభుత్వవర్గాలు చెవులు కొరుక్కొంటున్నాయి. ఆ అధికారి ఆ మంత్రికి మూడుకోట్ల రూపాయల వ్యయంతో స్వయంగా దగ్గరుండి ఇల్లు నిర్మించి ఇచ్చారని, రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరించే విషయంలో జరిగిన కుంభకోణంలో ఈ నిధులు మిగిలాయని విశ్వసనీయ సమాచారం. అవసరమైతే ఆ అధికారి రూ.10 కోట్లతో కూడా ఇల్లు నిర్మించి ఇవ్వగలరని.. ఎందుకంటే ఆ కుంభకోణంలో చేతులు మారిన నగదే కోట్లాదిరూపాయల్లో ఉంటుందంటున్నారు.
ఏపీలో కుంభకోణం జరిగిందంటూ సోము ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరించే విషయంలో కుంభకోణం జరిగిందంటూ భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. మూడుకోట్ల రూపాయలు ఖర్చుచేసి అధికారి ఒకరు మంత్రికి ఇల్లు కట్టించారని కూడా ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ మంత్రి ఎవరు? ఆ అధికారి ఎవరు? అనే చర్చే నడుస్తోంది. అప్రమత్తమైన ఇంటిలిజెన్స్ వెంటనే ఆరా తీసింది. ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎన్ని కోట్లరూపాయలు చేతులు మారాయి? ఎవరెవరికి ముడుపులు అందాయి? అనే విషయాలపై సమగ్ర వివరాలు సేకరించి ముఖ్యమంత్రికి నివేదించినట్లు తెలుస్తోంది.
అలాంటి అవకాశం మాకు లేదే?
మంత్రికి మూడు కోట్ల రూపాయల ఖర్చుతో ఒక అధికారి ఇల్లు కట్టించారనే ప్రచారం జరగడంపై ప్రజాప్రతినిధులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అలాంటి అవకాశం మాకు రాలేదేంటా? అంటూ వాపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ మంత్రి ఎవరనేదానిపై ప్రభుత్వం దగ్గర సమాచారం ఉందని, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ తర్వాత జగన్కు దగ్గరై వైసీపీలో చేరారని తెలుస్తోంది. పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు, అభ్యంతరకరమైన భాషకు ఆ మంత్రి పెట్టింది పేరు అనే ప్రచారం ఉంది. చంద్రబాబునాయుడు, లోకేష్పై ఆయన పదే పదే ఆరోపణలు గుప్పిస్తుంటారని, అటువంటి విమర్శలు మంత్రి హోదాలో చేయకూడదన్నా ఆయన వినిపించుకోరని, జగన్కు అత్యంత ప్రీతిపాత్రుడవడమే ఆయనకు కావాలని అధికారపార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. తన రాజకీయ ఎదుగుదలకు కారకులైనవారిపై, తనను ప్రజాప్రతినిధి చేసినవారిపై ఆయన గుప్పించే విమర్శలు కూడా ఎబ్బెట్టుగా మారుతున్నాయి. అటువంటి మంత్రిపై సోము వీర్రాజు ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్లో ఆయన్ను ఉంచుతారా? లేదా? అనే విషయంపై అధికార పార్టీలోకానీ, ప్రభుత్వ వర్గాల్లోకానీ ఒక స్పష్టత రాలేదు.