కరోనా వైద్యం పేరుతో చాలా మంది ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రాణాలను కాపాడుకోవడానికి తమ దగ్గర ఉన్నదంతా అమ్మి ఆసుపత్రుల్లో పెట్టారు. పైగా అప్పులు కూడా చేశారు. అయితే...వారు ఎంత ఖర్చు చేశారన్న విషయంపై స్పష్టత లేదు. దీనిపై ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కొవిడ్ కారణంగా దేశ ప్రజలు ఖర్చుపెట్టిన వివరాలను సేకరించి వెల్లడించారు.
కొవిడ్ సెకండ్ వేవ్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ను పక్కన పెడితే కనీసం వారికి బెడ్లు కూడా దొరకలేని పరిస్థితి వచ్చింది. ఇదే అదనుగా ఆస్పత్రులు మధ్యతరగతి వాళ్లని ఫీజులు అంటూ పిప్పి చేశారు. ఇదే క్రమంలో బ్లాక్ మార్కెట్ దందా మొదలయింది. కరోనా రోగులకు ఇచ్చే రెమ్డెసివర్ దొరకడమే గగనంగా మారిన పరిస్థితులను చూశాం. సాధరణంగా ఆ ఇంజక్షన్ ధర మూడు వేల లోపు ఉంటుంది. కానీ వాటిని ఏకంగా 30 నుంచి 50 వేల రూపాయల వరకు అమ్మేశారనే వార్తలు వచ్చాయి.
ఇలా ఇంజెక్షన్లకు అని ఆస్పత్రుల బెడ్లకు అని ట్రీట్మెంట్లకు రోగుల నుంచి ఆస్పత్రులు లక్షల్లో వసూలు చేశాయి. రూపాయి రూపాయి కూడబెట్టకుని వారి కుటుంబాన్ని పోషించుకుంటున్న వారు సైతం ఈ దోపిడికి అతీతులు కారనే విషయాన్ని మనం చూశాం.
అయితే ప్రజలు కరోనా కాలంలో వైద్యానికి ఎంత ఖర్చు చేశారనే విషయంపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియాతో పాటు అమెరికాకు చెందిన డ్యూక్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిటిట్యూట్ సంస్థలు సంయుక్తంగా సర్వే
సర్వే నిర్వహించాయి. ప్రజలు కరోనా టెస్టులు, చికిత్సకు చేసిన వ్యయంపై వివరాలను సేకరించింది.
ఈ సర్వే సేకరించిన వివరాలు వేసిన అంచనా చూస్తే కళ్లు బైర్లు కమ్మక మానవు. కేవలం కొవిడ్ చికిత్స కోసం భారతదేశ ప్రజలు ఏకంగా 64,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్టు ఈ సర్వే వివరించింది.
ఈ సర్వే పై ఆ సంస్థలు స్పందిస్తూ వివిధ రాష్ట్రాల్లో కరోనా చికిత్సపై ప్రజలు చేసిన ఖర్చును పరిగణలోకి తీసుకుని ఈ సర్వే చేశామని తెలిపాయి. అంతేకాకుండా ప్రజలు హాస్పిటల్లో చికిత్సకు చేసిన ఖర్చును మాత్రమే పరిగణలోకి తీసుకున్నామని రానుపోనూ ఖర్చులు లెక్కించలేదని కూడా ఆ సంస్థలు తెలిపాయి.