ఢిల్లీలో రైతు ఉద్యమం మరింత ఉధృతమైంది. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు... మరోవైపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల నేపథ్యంలో హస్తిన వాతావరణం టెన్షన్‌గా మారింది. రైతులతో పాటు  రైతు సంఘాలు కూడా సెంట్రల్‌ ఢిల్లీ చేరుకున్నాయి. నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ . జంతర్‌మంతర్‌ దగ్గరే రైతులు  నిరస ప్రదర్శన తెలుపనున్నారు. పార్లమెంట్‌ సమావేశాలకు కౌంటర్‌గా ప్రతిరోజూ మాక్ పార్లమెంట్‌ కూడా నిర్వహించనున్నారు. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో రైతుల నిరనసలకు పరిమితులతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రైతు నిరసనలకు పోలీసులు పర్మీషన్‌ ఇచ్చారు.

దాదాపు 8 నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనే ధర్నా చేస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలనేది రైతుల ప్రధాన డిమాండ్. ఇప్పటికే ప్రభుత్వంతో పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ... అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. అటు కేంద్రం కూడా దిగిరాకపోవడంతో... తమ నిరసనను మరింత తీవ్రతరం చేయాలని రైతులు నిర్ణయించారు. సింఘు సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతుల.... రోజుకు 200 మంది చొప్పున ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలో పాల్గొనాలని నిర్ణయించారు. మాక్ పార్లమెంట్‌లో మొదటి రెండు రోజుల్లో ఏపీఎంసీ యాక్ట్‌పై చర్చించనున్నారు. తర్వాత మిగిలిన చట్టాలపై కూడా చర్చ జరుగుతుందని తెలిపారు రైతు సంఘం నేతలు. ఈ మాక్ పార్లమెంట్‌కు అన్ని పార్టీల రాజకీయ నేతలను ఆహ్వానిస్తామన్నారు. ఆయా పార్టీల స్టాండ్‌ను వాళ్లు నిరభ్యంతరంగా మాక్ పార్లమెంట్‌లో తెలియజేయవచ్చని రైతులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసులను కలిసిన రైతు సంఘాల నేతలు... పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అటు వైపు వెళ్లమని లిఖితపూర్వక హామీ ఇచ్చారు. ప్రతి రోజు శాంతియుతంగానే తమ నిరనస ఉంటుందని... రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్ నేతలు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: