పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేస్తున్న హడావిడి వెనక ఒకరి వ్యూహం దాగివుంది. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఆ హడావిడివల్ల తమ ప్రయోజనాలు నెరవేరాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షిస్తున్నారు. దీనికోసం విజయసాయిరెడ్డిద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలనేది జగన్ కోరిక. అందుకే తనకు 2019 ఎన్నికల సందర్భంగా వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సహకారం తీసుకున్నారు. అయితే సాయిరెడ్డి చేస్తున్న హడావిడిపై భారతీయ జనతాపార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యూహం ఎలాంటిదంటే వైసీపీని బీజేపీకి దూరంచేసి కాంగ్రెస్కు దగ్గర చేయాలనేది ప్రశాంత్ కిషోర్ కోరిక. అందుకే వ్యూహంలో వ్యహాన్ని ఆయన పన్నారు.
రఘురామపై అనర్హత వేటు కోరుతున్న వైసీపీ
పార్లమెంటు సమావేశాల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. కంటిలో నలుసుగా మారిన ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలన్నదే ఆ పార్టీ ప్రధాన ఉద్దేశం. ప్రత్యేక రైల్వేజోన్ వద్దు.. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ వద్దు.. ఏమీ వద్దు.. మాకు కావల్సింది.. రఘురామపై అనర్హత వేటువేయాలని సాయిరెడ్డి బీజేపీ పెద్దలను కోరుతున్నారు. ఆయనపై అనర్హత వేటు వేస్తే మిగతా విషయాలపై దృష్టిసారించడం తమకు సులువవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర పెద్దల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో వైసీపీ ఎంపీలు కూడా ఈ హడావిడికి దూరం జరుగుతున్నారు.
కాంగ్రెస్కు దగ్గర చేయాలని పీకే?
పార్లమెంటులో అనుసరించే వ్యూహం వెనక ప్రశాంత్కిషోర్ ఉన్నారనేది సుస్పష్టమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై రోజురోజుకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో బలంగా ఉన్న జగన్ను కాంగ్రెస్ పార్టీకి దగ్గరచేయాలనేది పీకే వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై పీకే పరోక్షంగా ప్రస్తావించినప్పటికీ జగన్ వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పార్లమెంటులో వైసీపీ చేస్తున్న హడావిడిపై బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహాన్ని తనకు అనుకూలంగా మలచుకొని మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న కూటమిలోకి జగన్ను తీసుకురావాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఒకరకంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీకే వ్యూహంలో చిక్కి విలవిల్లాడుతున్నట్లు అర్థమవుతోంది.