ప్రధానమంత్రిగా నరేంద్రమోడీని ఆ పదవిలో కూర్చోబెట్టడంవెనక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహం దాగివుందనే విషయం దేశం మొత్తానికి తెలుసు. ఆ తర్వాత ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో జగన్, తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అధికారం చేపట్టడం వెనక పీకే కీలకపాత్ర పోషించారు. మధ్యలో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతాపార్టీ మాత్రం పీకేను కాదని అమిత్ షా వ్యూహం ప్రకారం వెళ్లి విజయం సాధించారు. అప్పటినుంచి మోడీ, అమిత్ షా పీకేను దూరం పెడుతూ వచ్చారు. ఇప్పటికి ఆ దూరం ఎంతలా పెరిగిందంటే నరేంద్రమోడీకి వ్యతిరేకంగా పీకే ఒక కూటమిని తయారుచేసేంతగా. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడమే లక్ష్యంగా ఆయన వ్యూహం పన్నుతున్నారు.
ఎన్డీయే, యూపీయే కూటమిలో లేని పార్టీలే ముఖ్యం
రాష్ట్రపతి ఎన్నికలను తన వ్యూహానికి మొదటిమెట్టుగా చేసుకోవాలని పీకే భావిస్తున్నారు. అందుకే ఆయన ఎన్డీయే కూటమిలో లేని పార్టీ నేతలను, యూపీయే కూటమిలో లేని పార్టీల నేతలను కలుస్తున్నారు. యూపీయే కూటమిలో ఉన్న పార్టీలు ఎలాగూ రాష్ట్రపతి పదవికి మద్దతు ప్రకటిస్తాయి కాబట్టి ఈ రెండు కూటములకు దూరంగా ఉన్న పార్టీలే ముఖ్యమని పీకే భావిస్తున్నారు. అందుకే ఆయన దక్షిణాదిపై దృష్టిపెట్టారు. స్టాలిన్, జగన్, నవీన్పట్నాయక్తోపాటు మమతాబెనర్జీని కీలకంగా భావిస్తున్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి కూడా మద్దతిస్తుంది. అందుకే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ శరద్పవార్ను రాష్ట్రపతి పదవికి పోటీచేయించాలనే యోచనలో ఉన్నారు.
మోడీ, అమిత్ షా మదిలో ఉన్నదెవరో?
పీకే చేస్తున్న ప్రయత్నాలను నిశితంగా గమనిస్తున్న మోడీ, అమిత్ షా కూడా తక్కువేం తినలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వారిమదిలో రాష్ట్రపతి పదవికి ఎవరనేది ఇప్పటికే ఉన్నారని, వ్యూహాత్మకంగా చివరి నిముషంలో ప్రకటింపచేయవచ్చని భావిస్తున్నారు. నరేంద్రమోడీ గ్రాఫ్ పెరగడానికి బాగా పనిచేసిన పీకేదే పైచేయిగా ఉంటుందని, ఇప్పటివరకు వారు నెరపిన రాజకీయ చాణక్యం అంతా ఆయనేదనని ఇప్పటికే తేలిపోయిందని, వ్యూహాలు పన్నడంలోకానీ, అమలు చేయించడంలోకానీ పీకేదే పైచేయించగా ఉంటుందికాబట్టి నరేంద్రమోడీపై ప్రశాంత్ కిషోర్ పైచేయి సాధించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.