మహారాష్ట్రపై ప్రకృతి పగబట్టినట్లుగా ఉంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మరాఠా రాజ్యం చిగురుటాకులా వణుకుతోంది. ఇప్పటికే అక్కడ ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో వరదల కారణంగా మొత్తం 136 మంది మృతి చెందినట్లు ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ ప్రకటించింది. వరదల కారణంగా రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రిజర్వాయర్ల గేట్లను అధికారులు ఓపెన్ చేసేసి... నీటిని దిగువకు వదిలేస్తున్నారు. వరదలతో పాటు పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. NDRF సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ ను సైన్యం కొవసాగిస్తోంది.
 
మహారాష్ట్రలోని కోల్హాపూర్, రాయ్ గఢ్, రత్నగిరి, పాల్గర్, థానే, నాగ్ పూర్ పట్టణాలపై వరుణుడు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఆయా పట్టణాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.  సహాయ చర్యల్లో పాల్గొనే సిబ్బంది కూడా వరద ఉధృతికి భయపడుతోందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రాయ్ గఢ్ జిల్లాలోనే శుక్రవారం ఒక్కరోజే 47 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గల్లంతైనట్లు తెలుస్తోంది. సతారా జిల్లాలో కూడా వరదల కారణంగా శుక్రవారం 27 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికే సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. వరద బీభత్సం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వరదల కారణంగా ఇప్పటికే ముంబై లోకల్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 120 విమానాలను అధికారులు దారి మళ్లించారు.  మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: