ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ నేతలు మరోసారి ఆలయాల యాత్ర ప్రారంభించారు. ఈరోజు నుంచే వారు ఈ యాత్రను మొదలుపెట్టారు. అద్వానీ రథయాత్రకన్నా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ నేతలు స్థానికంగా చేసే యాత్రలకన్నా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం వరకు ఏపీ ప్రశాంతంగా ఉండేది. ముఖ్యమంత్రి జగన్ ప్రశాంత్ కిషోర్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న తర్వాత ప్రశాంతత కోల్పోయిన ఏపీ దిక్కుతోచని స్థితిలో పడింది. మతమార్పిడులనేవి రాష్ట్రంలో ఎంత సంచలనంగా మారాయో తెలిసిందే. ఇప్పడు బీజేపీ నేతలు చేస్తున్న ఆలయాల యాత్రవల్ల మత విద్వేషాలు పెరగడమేకానీ ప్రజల మధ్య సఖ్యత మాత్రం కుదరదు. ఓటు రాజకీయాలు చేస్తున్నంతకాలం ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
ధ్వంసానికి గురైన ఆలయాల సందర్శన?
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఎమ్మెల్సీ మాధవ్, మరికొందరు నేతలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన అనంతరం యాత్రను ప్రారంభించబోతున్నారు. దైవ దర్శనాలు చేసుకోవడంతోపాటు రాష్ట్రంలో దాడికి గురైన ఆలయాలను కూడా పరిశీలిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం దాడికి గురైన ఆలయాలను మాత్రమే సందర్శించబోతున్నారని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకముందే కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేయాలని గతంలోనే నిశ్చయించుకున్నారుకానీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో యాత్రను వాయిదా వేశారు.
మతమార్పిడులపై ఆర్ ఎస్ ఎస్ తీవ్ర విమర్శలు
ఏపీలో మాతమార్పిడులపై ఆర్ ఎస్ ఎస్ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. ఎన్నడూ లేనివిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అన్యమత ప్రచారం జరుగుతోందంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. అద్వానీ రథయాత్ర బీజేపీని రెండు స్థానాల నుంచి 180 స్థానాలకు తీసుకువెళ్లింది. అలాగే ఇప్పుడు తాము చేపట్టే యాత్ర కూడా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తుందని సోము వీర్రాజు అంటున్నారు. అన్యమత ప్రచారంకానీ, మత మార్పిడులుకానీ, ఆలయాలపై దాడుల అంశంకానీ ఆ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. నాయకత్వ లోపమో, అధికార పార్టీతో అంటకాగుతున్న నేతలుండటంవల్లోకానీ ఇదే పరిస్థితి ఉత్తరాదిలో ఏ రాష్ట్రంలో ఉన్నా బీజేపీ ఈ సమయానికి పూర్తిస్థాయిలో బలోపేతమయ్యేది. కేంద్రం నుంచి వ్యూహరచన కొరవడిందా? లేదంటే ఏపీ నేతలకే దూరదృష్టి కొరవడిందా? అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరి ఈ ఆలయాల యాత్రతో పార్టీని ఏవిధంగా బలోపేతం చేస్తారో చూడాలి..??