బీజేపీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా అత్యధికంగా 79 సీట్లను దక్కించుకుంది. 224 సీట్లున్న రాష్ట్ర విధానసభలో బీజేపీకి అధికారం అందని ద్రాక్షగా మారింది. ఆ సమయంలో 65 స్థానాలు నెగ్గిన కాంగ్రెస్, 58 స్థానాలతో జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2007 లో కర్ణాటకలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ భారతదేశంలో తొలిసారి భాజపా సర్కారు కర్ణాటకలోనే ఏర్పాటైంది.
ఆరుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. 2007లో ఏర్పాటైన జేడీఎస్, భాజపా సంకీర్ణ సర్కారు పొరపొచ్చాల కారణంగా కూలిపోయింది. 2008 మే 30న రెండో సారి ముఖ్యమంత్రిగా యడ్డీ ప్రమాణ స్వీకారం చేశారు.
2018 మే 17న మూడో సారి ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు సూచనతో సంఖ్యా బలాన్ని చూపలేని యడియూరప్ప కేవలం ఆరు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ఏర్పాటైన సంకీర్ణ సర్కారు నుంచి 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలోకి చేరడంతో సంఖ్యా బలాన్ని పెంచుకున్నకమల దళం 2019 జులై 26న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ప్రస్తుత రాజకీయ సమీకరణల నేపథ్యంలో యడ్డీ రాజీనామా చేయాల్సి వస్తోంది. తరువాత సీఎం కుర్చీపై ఎవరు కూర్చుంటారనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. యడ్యూరప్ప సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలో చెప్పనని అధిష్టానంకు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఎవరికి వారే పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ప్రహ్లద్ జోషి, సి.టి.రవి, మురుగణ్ నిరాణి , బసవరాజ బొమ్మయ్ పేర్లు పరిశీలిస్తున్నట్టు సమాచారం.. ఈ నెల 26 తరువాత కర్ణాటక కమల దళపతి ఎవరనేది తేలనుంది.