తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా రెవంత్ వచ్చిరాగానే మాటల తూటాలు పేల్చారు. ఈ మాటలు చేతి గుర్తుపై గెలిచి కండువా మార్చిన 12 మంది ఎమ్మెల్యేల గురించే అని అందరికీ తెలిసిన విషయమే. దీనిపై ఒకరిద్దరు ఎమ్మెల్యేలు.. కౌంటర్ ఇచ్చినా చాలామంది గమ్మున ఉన్నారు. తొందరపాటు ఎందుకనుకున్నారో లేక.. ఆచితూచి స్పందించాలని నిర్ణయించారో తెలియదు గాని వాళ్లు మాత్రం స్పందించడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలంగానే ఉందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది.
క్యాడర్ని తిరిగి యాక్టివ్ చేయడానికి త్వరలోనే కార్యాచరణ ప్రకటించాలనే నిర్ణయాన్ని పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రకటించింది.ఈ సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలలో కొందరు కాంగ్రెస్తో టచ్లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇదే దారిలో ఖమ్మం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ఉన్నారని తెలుస్తోంది. అప్పట్లో రేవంత్ సిఫారసుతో టికెట్ పొందినవారిలో ఈమె ఒకరు. ఎమ్మెల్యే గెలిచిన హరిప్రియ నాయక్ తరువాత కారు పార్టీలోకి వెళ్లారు. ఆ సమయంలో రేవంత్ మనుషులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతున్నారనే ప్రచారం జరగడంతో హరిప్రియ కూడా సర్దుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తరువాత ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తిరిగి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడినట్టు సమాచారం.
దీంతో కాంగ్రెస్లో హరిప్రియ గురించి చర్చ జరుగుతోంది. అయితే.. ఆమె ఇప్పటికిప్పుడు అధికార పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇంకా రెండున్నరేళ్ల ఎమ్మెల్యే పదవి చేతిలో ఉండగా.. తొందర పడి ఆమె నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం పార్టీ నుంచి వెళ్లినవారిని వెనక్కి తెచ్చేందుకు ఘర్వాపసీ చేపట్టడంతో ఈ పరిణామం ఆసక్తిగా మారింది.