ఆధునిక వసతులతో ఒకేసారి 12 వివాహాలు జరిగేలా కొండపై కల్యాణ మండపాన్ని దేవస్థానం బోర్డు నిర్మించింది. దాతల సహకారంతో శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపం నిర్మించిన దేవస్థానం... దీనిని ఈ ఏడాది ఆగస్టు నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రావణమాసంలో జరిగే పెళ్లిళ్లకు అప్పుడే రిజర్వేషన్లు కూడా మొదలు పెట్టేసింది. రత్నగిరిపై వివాహం జరిగితే భవిష్యత్తు బంగారంలా ఉంటుందనేది భక్తుల నమ్మకం. అలాగే ఖర్చును భరించలేని వారు కూడా రత్నగిరిపై తంతు ముగించేందుకు వస్తుంటారు. ఈ కారణంతోనే ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్దఎత్తున భక్తులు సత్యదేవుని సన్నిధికి వచ్చి కల్యాణ తంతు పూర్తి చేసుకుంటారు.
ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉండే వారి కోసం దేవస్థానం వినూత్న ఆలోచన చేసింది. శ్రీ లలిత రైస్ ఇండస్ట్రీస్ సంస్థ యాజమాన్యం సహకారంతో కలిసి రూ.3.5 కోట్లతో అత్యాధునిక వసతులతో ఏసీ కల్యాణ మండపం నిర్మించారు. ఒకేసారి 12 జంటలకు అనుకూలంగా ఈ వేదికను నిర్మించారు. మండపం కేటాయింపులో పేదలకే అగ్రస్థానమని ఆలయ ఈవో ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 16న మండపం ప్రారంభించారు. ఈ మండపం శ్రావణ మాసం బుకింగ్ పూర్తిగా ఫుల్ అయినట్లు ఆలయ అధికారులు ఇప్పటికే వెల్లడించారు.