విశాఖలో వైసీపీ నాయకులు హవా చలాయిస్తున్నారని, వారి కంటికి కనిపించిన స్థలాలను పెద్ద ఎత్తున కబ్జా చేసేస్తున్నారు అంటూ ప్రచారం చేసుకొచ్చారు. ఈ సంగతి ఇలా ఉంటే రామానాయుడు స్టూడియో మీద మాత్రం నిజంగా పుకార్లే షికారు చేశాయి. అది ఎపుడో 2000 ప్రాంతంలో అంటే చంద్రబాబు సీఎం గా ఉండగా స్టూడియో నిర్మాణానికి ఇచ్చిన భూమి అది. మొత్తం 40 ఎకరాల భూమి, ఆ స్టూడియో ప్రభుత్వానికి కావాల్సి వచ్చాయని కూడా ప్రచారం చేశారు. ఇవ్వకపోతే ఏదో విధంగా అయినా ప్రభుత్వ వర్గాలు తీసేసుకోవడానికి రెడీ అని కూడా రాశారు.
అయితే దానిమీద డి రామానాయుడు పెద్ద కుమారుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు క్లారిటీ ఇచ్చేశారు. ప్రభుత్వం తమను స్టూడియో స్వాధీన విషయంలో అసలు ఏమీ అడగలేదని ఆయన చెప్పేశారు. అలాంటి విషయమే తన వద్దకు రాలేదు అని అన్నారు. మరి ప్రభుత్వం అడగకుండానే ఇంతటి విష ప్రచారం చేసి అటు జగన్ని ఇటు వైసీపీ సర్కార్ని బదనాం చేసిన ఈ కుట్ర కోణం ఎవరిది అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది.
ఈ విషయంలో వైసీపీ నేతలు కూడా తమ వివరణ కానీ, వాదన కానీ ఎక్కడా వినిపించకపోవడంతో ఈ ప్రచారమే జనాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో విశాఖకు రాజధాని కనుక వస్తే తమ ఆస్తులు ఏమవుతాయో అన్న కంగారు భయం మాత్రం విశాఖ వాసులో కలిగింది. దీని వెనక ఎవరు ఉన్నా కూడా నోరెత్తని వైసీపీ నేతలదే ఈ తప్పు మొత్తం అని అనుకోవచ్చేమో.