తాజాగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ రూపంలో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారంటూ... తీవ్ర ఆరోపణలు చేసిన దేవినేని... ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించారు. అయితే తిరిగి వస్తున్న సమయంలో దేవినేని ఉమాపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఉమా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు టీడీపీ కార్యకర్తలకు దెబ్బలు తగిలాయి. తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని... దీని వెనుక ఉన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై కేసు నమోదు చేయాలంటూ జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట దేవినేని ఉమా ధర్నా చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు కారులో కూర్చుని ఆందోళన కొనసాగించారు.
అయితే దాడి చేసిన వారిని వదిలివేసిన పోలీసులు.... ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలపై మాత్రం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం ప్రస్తుతం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. వాహనం అద్దాలు తొలగించి... దేవినేనిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి మాజీ మంత్రిని పెదపారుపూడి స్టేషన్ కు ఆ తర్వాత నందివాడ స్టేషన్ కు తరలించారు. ఇప్పుడు ఇదే అంశం విమర్శలకు తావిస్తోంది. దాడి చేసిన వారికి బదులుగా బాధితులను ఎలా అరెస్ట్ చేస్తారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులను నిలదీస్తున్నారు. రాష్ట్రంలో అరాచకమైన పాలన జరుగుతోందన్నారు మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. అయితే జి.కొండూరులో అలజడి సృష్టించారనే ఆరోపణలపైనే దేవినేని ఉమాను అరెస్ట్ చేసినట్లు డీఐజీ మోహన్ రావు తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే దేవినేని ఆ ప్రాంతానికి వెళ్లి రెచ్చగొట్టేలా వ్యవహరించినట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఏది ఏమైనా... కృష్ణా జిల్లా పాలిటిక్స్ రాష్ట్రంలో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి.