కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తింది. ఇప్పటికే ఎగువనున్న అన్ని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలతో ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రికార్డు స్థాయిలో వరద పోటెత్తడంతో... దిగువ ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు అధికారులు. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో దిగువనున్న శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. రికార్డు స్థాయిలో ఇప్పటికే 4 లక్షల పై చిలుకు నీరు అటు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 879 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 173 టీఎంసీల నీరు ప్రాజెక్టులో అందుబాటులో ఉంది.

దీంతో 2007 తర్వాత తొలిసారిగా జులై నెలలోనే డ్యామ్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సాధారణంగా ప్రతి ఏటా ఆగస్టు నెలలో డ్యామ్ గేట్లు పైకి ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తారు. కానీ ఈ ఏడాది జులై నెలలోనే రికార్డు స్థాయి వరద రావడంతో... వారం రోజులు ముందుగానే డ్యామ్ జలకళను సంతరించుకుంది. మొత్తం 12 గేట్లలో ఈ సాయంత్రం 3 గేట్లను ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డ్యామ్ లో నీరు పూర్తిగా రావడంతో... గేట్ల ద్వారా ఇప్పటికే నీరు లీక్ అవుతోంంది. అటు పై నున్న సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగిపోయింది. ఇటు దిగువనున్న నాగార్జున సాగర్ పరిహాహక ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం ఎడమ, కుడి గట్టు కాలువల్లో విద్యుత్ ఉత్తత్పి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అటు దిగువనున్న పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ ల నుంచి ఇప్పటికే వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: