కాంగ్రెస్ అన్న పదం ఎందుకు వదులుకోరు అని చాలా రోజుల కిందట నేను విన్న మాట..ఓ చోట.. ఎందుకంటే ఆ పదం వల్ల ప్రయోజనం ఉంది కదా అని అన్నారు కొందరు. ఇప్పుడు సఫిక్స్ వలన లాభపడ్డ వారంతా ఒక్కొక్కరుగా చేరితే సోనియా బలం పెరిగితే పెరగడం ఖాయం. ఎందుకంటే తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు దగ్గరవుతున్నారు. మోడీని దించేందుకు ఓ సాధారణ కార్యకర్తలా పనిచేస్తానని చెబుతున్నారు. దేశంలో మోడీ వల్ల నష్టపోయిన శక్తులన్నీ ఏకం అయితే దేశం లో మార్పునకు కారణం కావొచ్చన్నది మమతా ఆశ..ఆవగింజంత ఆశ అని రాయాలి.
అదేవిధంగా మోడీ ని వ్యతిరేకిస్తున్న మమతా తను ఒక మెట్టు దిగారనే అనిపిస్తుంది. బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని పట్టు సాధించిన ఆమె దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పేందుకు సోనియా సాయం కావాలని భావిస్తున్నారు. కానీ దీదీ అహం భావాన్ని సోనియా తట్టుకోగలరా అన్నది ప్రశ్న. మరోవైపు కేసీఆర్ లాంటి నాయకులు కూడా దేశ రాజకీయాల్లోనే ఎదగాలని చూస్తు న్నారు. ఒకవేళ అదే నిజమయితే ఆయన కూడా కాంగ్రెస్ తో జట్టు కట్టడమో లేదా తృతీయ ఫ్రంట్ రూపకల్పన చేయడమో చేయొచ్చు..
నిన్నటి వేళ మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు.. కాంగ్రెస్ బలహీనపడిందా అన్న మాట తాను నిరాకరిస్తూ సమాధానం చెప్పారు.తాను ఏ పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోనని చెప్పడంతో విపక్షాల ఐక్యతే తన ధ్యేయం అని తేల్చేశారు..ఇదే సమయంలో దీదీతో పాటు మాయ కూడా కాంగ్రెస్ తో జత కడతారా? అన్నది ప్రశ్న.. దేశం అంతా ఓ వైపు మోడీ ఓ వైపు అన్న విధంగా రానున్న ఎన్నికలు సాగుతాయని దీదీ చెబుతున్నారు. కానీ మోడీ ని దించడం సాధ్యమా? బాగా డబ్బులున్న పార్టీగా ఇప్పుడు బీజేపీ ఉంది. కార్పొరేట్ శక్తులకు గడిచిన కాలంలో చాలా సాయం చేసింది. అలాంటప్పుడు కాంగ్రెస్ ను, తృణముల్ ను ఆయన వ్యతిరేక శక్తులుగా భావించరు.. భావించినా వారి శక్తి ఏపాటిది అన్నది మోడికి తెలుసు. ఇక పేరులో కాంగ్రెస్ అన్న పదాన్ని ఇముడ్చుకున్న ఎన్సీపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ తో ఉంటాయా ఉండవా అన్నది కీలకం.. మోడీ ఎలానూ తమ మాట వినడం లేదు అని బాబులానే జగన్ అనుకుంటే అప్పుడు వైరం మొదలుకావొచ్చు. అందాక మోడీ కి వైసీపీకి తెగేదే లేదు.. అలా అని తృతీయ ఫ్రంట్ ఆశల్లో జగన్ లేరని అనుకోలేం. కాంగ్రెస్ కు చేరువ కాలేరా అంటే చెప్పలేం.. ఏమో రాజకీయాల్లో ఏదయినా కావొచ్చు. ఈ శత్రుత్వాలు అప్రియత్వాలు.. ఆ స్నేహాలు తాత్కాలికాలు..