ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెయిల్ పై ఉన్నారు. ఆయన ప్రతిసారీ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై సీబీఐ వ్యవహారం ఎలా ఉందంటే పిల్లి మెడలో గంట కట్టేవారు దొరకలేదన్నట్లుగా ఉంది. బెయిల్ షరతుల ఉల్లంఘనలకు ఇదిగో ఆధారాలున్నాయంటూ దాఖలైన పిటిషన్పై తన అభిప్రాయం చెప్పమంటే అదిగో.. ఇదిగో అంటూ రవిబాబు సినిమా టైటిల్ను తలపిస్తోందేకానీ అంత పేరు గొప్ప కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి మాత్రం ఎటువంటి స్పందన ఉండటంలేదు. ఎందుకో వారికే తెలియాలి. కేంద్ర పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడా? లేదంటే వారి పై అధికారుల నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా? అనేది కూడా తెలియడంలేదు.
మూడువారాలకు వాయిదా కోరిన సీబీఐ
ఎంత దారుణమంటే ఒకసారి తమ న్యాయవాదికి జ్వరం వచ్చిందని, అందుకే లిఖితపూర్వకంగా ఇస్తామన్న తమ అభిప్రాయాన్ని ఇవ్వలేకపోతున్నామని, మూడువారాలకు వాయిదా వేయాలని కోరింది. గతంలోనే సీబీఐ కోర్టు న్యాయమూర్తులు హెచ్చరిస్తున్నప్పటికీ తన ధోరణి మార్చుకోని సీబీఐ అధికారులు ఈరోజు కూడా యథాప్రకారం వ్యవహరించారు. వాదనలకు సమయం కావాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులకే కాకుండా కోర్టుకు కూడా వారి వ్యవహారంపై చిరాకేసింది. వాదనలు వినిపించడంలేదని చెప్పింది. జగన్రెడ్డి, రఘురామరాజు దాఖలు చేసిన కౌంటర్ల ఆధారంగా సీబీఐ ఆగస్టు 25వ తేదీన బెయిల్ రద్దుపై ఓ నిర్ణయం తీసుకోనుంది.
జగన్కన్నా సీబీఐనే ఎక్కువ కంగారుపడుతోంది
జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఒక్కసారి తన అభిప్రాయం చెబితే సీబీఐకి వచ్చే నష్టం ఏమిటో వారికే తెలవాలి. ఒక్క బెయిల్ రద్దు పిటిషన్పై ఆ సంస్థే ఇన్ని డ్రామాలాడుతుంటే ప్రజలేమనుకోవాలి. చూస్తుంటే జగన్ కంటే సీబీఐనే ఎక్కువగా కంగారుపడుతోందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. తానేం చెప్పాలనుకుంటున్నారో జగన్ చెప్పేశారు.. సీబీఐ మాత్రం చెప్పడంలేదు.
వాయిదాలు అడుగుతూనే ఉంది. కౌంటర్ దాఖలు చేయడానికి కరోనా సాకు చెప్పి మూడుసార్లు వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశమని కోర్టు హెచ్చరించిన తర్వాతే మూడులైన్ల కౌంటరిచ్చింది. అసలు వాయిదాలమీద వాయిదాలు ఎందుకు కోరుతున్నారు? ఎవరికి లాభం చేకూర్చాలనుకుంటున్నారనేది వారికే తెలియాలి మరి..!!