దళిత బంధు పథకం తప్పక అమలు చేసి తీరుతామని, ఏడాది ముందరే ఇది అమలు కావాల్సి ఉందని పేర్కొంటూ కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో చేరికలు జరుగుతున్నందున ఆయా శ్రేణులలో ఉత్సాహం నింపుతూ..తెలంగాణ భవన్ లో మాట్లాడారు. తాజాగా బీజేపీ నేత పెద్ది రెడ్డి చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.. ఆ వివరాలివి..
తాను చెప్పిందే చేస్తానని, మాట ఇచ్చాక తప్పనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో బీజేపీ లీడర్ పెద్ది రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను గతంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక అన్ని సమసిపో యాక అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని అన్నారు. తెలంగాణలో ఆత్మ హత్యలు లేవని చెప్పారు. దేశంలోనే తక్కువ సం ఖ్యలో ఆత్మ హత్యలు నమోదవుతున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. అట్టడుగు వర్గాలకు పెన్షన్లు అందుతున్నాయని ఇది తన పరిశీలనలో తేలిందని చెప్పారు. దళితులకు మేలు చేసేందుకు తాను వెనుకాడనని, ఆరు నూరైనా దళిత బంధు పథకం అమలవుతుందని వెల్లడించారు. పెద్ది రెడ్డి తనకు మంచి స్నేహితుడు అని, గతంలో కలిసి పనిచేశానని, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తనతో ఉన్నారని అన్నారు. ఇక ప్రాజెక్టుల సంగతి ప్రస్తావిస్తూ పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కశ్మీర ఖండం అవుతుందని అన్నారు. చేతన బీమా తో పాటూ దళిత బీమా కూడా అమలు చేస్తామని, దళిత బీమా అమలు చేసేందుకు ఇంకొంత సమయం పడుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందనంతగా పురోగతి చెందుతుందని అన్నారు.ప్రసంగంలో భాగంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం గురించి కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఆ రోజు ఉద్యమంలో చివర చేరిన వారే ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు.