కరోనా థర్డ్ వేవ్‌ వచ్చేసిందా.. వచ్చినా ఇండియాలో వచ్చిందా.. ప్రపంచంలోని ఏ ఇతర దేశంలోనో వచ్చిందా.. ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వచ్చేసిందని ఎందుకు అనుకుంటున్నారు.. కరోనా థర్డ్ వేవ్‌ వచ్చిందని భావించేందుకు ఆధారాలేంటి.. అసలు దేశంలో కరోనా పరిస్థితి ఏంటి.. కరోనా థర్డ్ వేవ్ వచ్చేసి ఉంటే.. దాని ప్రభావం ఎలా ఉంటుంది.. ఇలాంటి ఉహాగానాలు బాగా సాగుతున్నాయి.


అయితే.. ఏదో గాలి కబుర్లుగా కాకుండా కరోనా థర్డ్ వేవ్‌ గురించి కొన్ని గణాంకాల సాయంతో పరిస్థితిని అంచనా వేద్దాం.. దేశంలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న విషయం నిజమే.  కొత్తగా మూడు వారాల గరిష్టానికి కొత్త కేసులు చేరుకున్నాయి. శుక్రవారం కొత్తగా 44వేల 230 కేసులు రికార్డు అయ్యాయి. దీంతో కరోనా థర్డ్‌ వేవ్‌ మెుదలైందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు.. కేరళలో కరోనా మరోసారి తీవ్రంగా ఉంది. మూడు రోజులుగా అక్కడ 22 వేలకు పైగా నమోదవుతున్నాయి.


ఇండియాలో రికార్డు అయ్యే మెుత్తం కేసుల్లో 37 శాతానికి పైగా  కేరళ నుంచే వస్తున్నాయి. ఇక  కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి వేగాన్ని తెలియజెప్పేది  ఆర్‌-ఫ్యాక్టర్‌. దీని విషయం పరిశీలిస్తే.. ఇది క్రమంగా 1కి చేరువవుతోంది. సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆర్ ఫ్యాక్టర్‌ 1.37గా ఉంది. ఆ తర్వాత అది తగ్గుతూ ఒక దశలో  0.78కి పడిపోయింది. అయితే జులైలో మళ్లీ పెరుగుదల మొదలైంది. జులై 3 - 22 మధ్య ఏకంగా 0.95 ఆర్‌-ఫ్యాక్టర్‌ చేరుకుంది.


ఇక కేరళలో ఆర్‌-ఫ్యాక్టర్‌ ఏకంగా 1.11 ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఇది 1 దాటింది. పుణె, దిల్లీల్లోనూ ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరుగుతోంది. అయితే ఈ లెక్కలను బట్టి కరోనా థర్డ్ వేవ్ మొదలైందని చెప్పలేం. అయితే జాగ్రత్త మాత్రం అవసరం. నిపుణులు మాత్రం థర్డ్‌వేవ్‌ ప్రభావం అంతగా ఉండకపోవచ్చంటున్నారు. ఇప్పటికే దేశంలోని 67.6శాతం ప్రజలకు కరోనాపై పోరాడే యాంటీబాడీలు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 45 కోట్ల టీకాలు కూడా ఇచ్చాం. అందువల్ల కరోనా థర్డ్ వేవ్‌ రాకపోవచ్చని.. వచ్చినా అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: