రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు అల్లుతున్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం కూడా నడుస్తోంది. తాను పార్టీలో చేరేది ముఖ్యం కాకపోయినా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ కూటమివైపు తీసుకురావడం ముఖ్యమనేది పీకే వ్యూహంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోటీచేసినా మెజారిటీకి అవసరమైన 272 స్థానాలను సాధించే పరిస్థితి కనపడటంలేదు. దీంతో పీకే కొన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
జగన్కు దగ్గరైన పీకే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసిన పీకే జగన్కు బాగా దగ్గరయ్యారు. జగన్కు కూడా పీకే వ్యూహాలపై, అభిప్రాయాలపై మంచి గౌరవం ఉంది. తాజాగా విజయసాయిరెడ్డిని ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కటమిలోకి రావాలని కోరగా జగన్తో మాట్లాడి చెబుతానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కూటమివైపు వెళితే కేసులు, ఇతరత్రా ఇబ్బందులు కేంద్రం నుంచి ఎదురయ్యే పరిస్థితి కనపడుతోందని విజయసాయి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించలేకపోతే తామంతా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని సాయిరెడ్డి పీకేకు చెప్పినట్లు తెలుస్తోంది.
బీజేపీ వేధింపులకు పరిష్కారం చెప్పిన పీకే
సాయిరెడ్డి చెప్పినదానికి కూడా పీకే ఒక పరిష్కారం చెప్పారు. కేసుల పేరుతో వేధిస్తోందని సానుభూతి సంపాదించుకుంటే ఈసారి ఎన్నికలకు కూడా బాగా ఉపయోగపడుతుందన్నారని పార్టీవర్గాలంటున్నాయి. అయితే ఆ విషయం జగన్తో మాట్లాడాలని విజయసాయి చెప్పగా కేసుల పేరుతో ఇబ్బంది పెట్టినా ప్లస్ అవుతుందని ఆలోచించాలని పీకే చెప్పారని సమాచారం. సంవత్సర సమయం లేదా సంవత్సరన్నర ముందుగా కేంద్రంపై యుద్ధం ప్రకటించి వారు తీసుకునే చర్యలను బట్టి సానుభూతితో ఎన్నికలకు వెళ్లవచ్చనేది వ్యూహంగా చేసుకోవాలని పీకే సూచించినట్లు తెలుస్తోంది. ఒకరకంగా పీకే వైసీపీని కాంగ్రెస్వైపు తీసుకువెళితే ఆ పార్టీతో అనధికారిక స్నేహం చేస్తోన్న బీజేపీ గట్టి దెబ్బతగిలినట్లే అవుతుంది. అయితే వైసీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.