తెలంగాణ ప్రభుత్వం అర్హులకు రజకులకు, నాయి బ్రాహ్మణులకు 250యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 28వేల 550మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లై చేసుకున్న వారిలో 10వేల 637మంది రజకులు కాగా.. 17వేల 913మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారు. మరోవైపు ఇంకా అర్హులైన వారికోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సంక్షేేమ ఫలాలు అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తున్నారు. ఆధార్ కార్డ్ కు సంబంధించిన వివరాలు... ఫోన్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికెట్, అడ్రెస్, కరెంట్ బిల్, రెంటల్ కు సంబంధించిన పత్రాలు, ఫోటో, షాప్ ఫోటో, లేబర్ లైసెన్స్ లతో దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్త ప్రభుత్వం కుల వృత్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది. వారిని ఆ వృత్తుల్లో ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇటీవల గొల్లకురుమలకు గొర్రెలు కూడా పంపిణీ చేసింది. గంగపుత్రులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసింది. ఇక కల్లు గీత కార్మికులకు ఈత చెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా రజకులు, నాయి బ్రాహ్మణుల కోసం ఉచిత కరెంట్ అందించి వారిని ప్రోత్సహించేందుకు సిద్దమైంది. చాలా మంది రజకులు, నాయి బ్రాహ్మణుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటోంది. ఆర్థికంగా చితికిపోయి అవస్థలు పడుతున్న వారికి ఊరట కలిగించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో రజక, నాయిబ్రాహ్మణ సోదురుల జీవితాల్లో వెలుగులు రానున్నాయి.