ఇక ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈ నెలాఖరులో వస్తుందని ఢిల్లీ వర్గాలు చెపుతున్నారు. దీంతో ఉప ఎన్నికల బరిలో ఈటల ఉంటారా ? లేక ఆయన భార్య జమున ఉంటారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈటల భార్య జమునా రెడ్డి సైతం గుర్తు కమలం పువ్వే కానీ,పోటీలో ఎవరున్నా ఒక్కటేనని అన్నారు. దీనిని బట్టి ఎన్నికల బరిలో భర్త ఈటల ఉన్నా, తాను ఉన్నా ఒకటేనన్నది ఆమె అభిప్రాయంగా అర్థమవుతోంది.
బీజేపీ నుంచి ఈటల లేదా ఆయన భార్య పోటీ చేసినా భారం అంతా ఈటల మీదే ఉండనుందన్నది తెలిసిందే. ఇక కొత్తగా పార్టీలోకి వచ్చిన ఆయనకు
స్థానికంగా బీజేపీ నుంచి కొంత సహాయ నిరాకరణ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఎక్కువ ప్రయార్టీ ఇవ్వడంతోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి లాంటి వాళ్లు పార్టీకి దూరమయ్యారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికే టార్గెట్ గా ఈ నెల 16 న సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో దళితబంధు గర్జన చేయనున్నారు.
మరోవైపు అక్కడ ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మోహరించేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందే అత్యంత వేగంగా కేసీఆర్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను హుజురాబాద్ లో తలపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో ఈటల అక్కడ పోటీ చేయకుండా భార్యను పోటీ చేయిస్తే ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. మరి ఈటల నిర్ణయం ఎలా ? ఉంటుందో ? చూడాలి.