తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసులో కీలక అనుమానితుడుగా ఉన్న సునీల్‌కుమార్‌ యాదవ్‌ను అరెస్ట్‌ చేశారు. సోమవారం గోవాలో అదుపులోకి తీసుకున్న ఆయన్ను.. మంగళవారం తెల్లవారుజామున కడపకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గోవాలో సునీల్‌ను అరెస్ట్‌ చేసిన విషయాన్ని సీబీఐ విచారణ ధృవీకరించింది. గోవాలో సునీల్‌ను అరెస్ట్‌ చేసిన తర్వాత.. అక్కడి కోర్టులో ఆయన్ను హాజరుపర్చింది. గోవా కోర్టు ద్వారా సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను ట్రాన్సిట్‌ రిమాండులోకి తీసుకుంది సీబీఐ. నిందితుడ్ని కడపకు గోప్యంగా తరలించారు. ప్రస్తుతం లాంఛనాలు పూర్తి చేస్తున్నారనీ, అవి పూర్తయ్యాక కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం.

మరోవైపు కడప, పులివెందులలో సీబీఐ విచారణ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి విచారణ సాగిస్తున్నారు. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని అధికారులు ప్రశ్నించారు. పులివెందుల ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో దాదాపు గంటకుపైగా హత్య కేసుకు సంబంధించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  మరో బృందం వివేకా ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించింది. వివేకా ఇంటి నుంచి సమీపంలోని ఆటో మొబైల్‌ దుకాణం వరకు సీబీఐ అధికారులు కొలతలు తీసుకున్నారు. వివేకా ఇంటి రోడ్డు మార్గంలో ఇరువైపులా ఉన్న కొలతలను ఆటో మొబైల్‌ దుకాణం ప్రహరీ గోడను, దాని ఎత్తును పరిశీలించి సర్వేయర్‌ ద్వారా కొలతలు వేసి రికార్డును నమోదు చేసుకున్నారు. హత్య జరిగినరోజు ఈ ప్రాంతం నుంచి దుండగులు ఏమైనా వెళ్లారా? అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే వివేకా హత్య కేసులో వాచ్‌మెన్‌ రంగయ్య వాంగ్మూలం కీలకంగా మారింది. వివేకాకు సన్నిహితంగా ఉండే సునీల్‌కుమార్‌ యాదవ్‌ తోపాటు ఆయన సోదరుడు కిరణ్‌కుమార్‌ యాదవ్‌, తల్లిదండ్రులను సైతం సీబీఐ ప్రశ్నించింది. కాగా తమను సీబీఐ అధికారులు విచారణ పేరుతో వేధిస్తున్నారని సునీల్‌కుమార్‌ యాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు. సునీల్‌పై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించకున్నప్పటికీ.. చేశారంటూ హైకోర్టును అతను ఆశ్రయించడాన్ని సీబీఐ సీరియస్‌గా తీసుకుంది. ఇది తెలిసిన సునీల్‌ గోవాకు పారిపోయి తలదాచుకోగా.. సీబీఐ పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి అతడ్ని అరెస్ట్‌ చేసి కడపకు తరలించింది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: