డిప్యూటీ సీఎం ఊరికి దగ్గర ఊరు. జగన్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రాంతానికి గ్రానైట్ తవ్వకాలు వస్తాయని ఎన్నడూ ఎవ్వ రూ ఊహించని ఊరు. అలాంటి ఊరులో గుట్టు చప్పుడు కాకుండా కలర్ గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది ఏపీ సర్కా రు. దీంతో ఉపాధి మార్గాలు ఉంటాయని చెప్పడంలో మతలబు ఏంటో తెలియదు. తమను కొండ నుంచి దూరం చేయవద్దని ఇది మా జీవనాధారం అని గిరిజనులు గోడు వెళ్లబోసుకుంటున్నా ఆపే నాథుడు కానీ అడిగే నాథుడు కానీ లేడు. పార్టీలు కొట్టుకుంటా యే కానీ ఈ విషయమై అధికార పార్టీపై విపక్షం అస్సలు గొంతెత్తకపోవడమే విచారకరం.
మాట్లాడాల్సిన చోట మాట్లాడక పోవడమే వైసీపీ కానీ టీడీపీ కానీ చేస్తున్న తప్పిదం. కొండలు తవ్వ వద్దని తాము నిరుపయోగ జీవనం ఒకటి తరువాత కాలంలో సాగించాల్సి వస్తుందని గిరిజనులు ఏనాటి నుంచో మొత్తుకుంటున్నారు. సారవకోట మండలం లో కలర్ గ్రానైట్ తవ్వకాలు వద్దని కూడా ఎందరో మొత్తుకుంటున్నారు. అయినా కూడా ఓ ప్రయివేటు కంపెనీ అనుమతులు పొందింది. అధికార పార్టీ సాయంతోనే ఆ కంపెనీ రేపో మాపో తవ్వకాలు ప్రారంభించి, ఉన్నదంతా దోచుకుని పోతే ప్రేక్షక పాత్రకు పరిమితం అవ్వడం మినహా టీడీపీ చేసేది ఏమీ లేదు. కానీ టీడీపీ ఎందుకనో మాట్లాడడం లేదు. మాట్లాడాల్సిన చోట మాట్లాడ కుండా మౌనం వహించడం కారణంగా విలువయిన ప్రకృతి సంపద కార్పొరేట్ శక్తుల గుప్పిట బంధీ అవ్వడం ఖాయం.
ప్రధాన సామాజిక సమస్యలపై ఎవ్వరూ మాట్లాడక పోవడమే సిసలు వింత. సూదికొండ తవ్వకంపై కానీ రేపో మాపో ప్రారంభం అయ్యే కలర్ గ్రానైట్ తవ్వకాలపై కానీ మాట్లాడకపోవడమే విడ్డూరం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా పోరాటాలు అన్నవే మరిచిపోయింది. తమకు అనుకూలం అనుకున్న విషయాలు, తమ వారికి అనుకూలం అయ్యే విషయాలు మాత్రమే మాట్లాడుతోంది. అలా మాట్లాడడం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో ప్రజా సమస్యలపై గళం వినిపించే వారే కరవవుతున్నారు.
ముఖ్యంగా కలర్ గ్రానైట్ తవ్వకాలు బొంతు రెవెన్యూ పరిధిలో రేపటి వేళ చేపట్టనున్నారు. సారవకోట మండలం అన్నది నరసన్నపేట నియోజకవర్గంలో ఉంది. కానీ వైసీపీని ఢీకొనేందుకు అచ్చెన్న ఇష్టపడడం లేదు. కేసుల భయంతో వెనక్కు తగ్గుతున్నారు అన్న విమర్శ కూడా ఉంది. దీంతో అధికార పార్టీ చేపట్టాలనుకున్న ప్రతి పనీ నిరాటంకంగా సాగిపోతోంది. గ్రానైట్ తవ్వకాలు ప్రారంభం అయ్యే వేళ టీడీపీ మాట్లాడినా ఫలితం ఉండదు. ఇప్పటి నుంచే న్యాయ పోరాటం చేయాల్సిన టీడీపీకి అంత సమయం కానీ ఓపిక కానీ లేవనే తేలిపోయింది.