విషయంలోకి వెళ్తే.. గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీకి మంచి బలం ఉంది. 2014లో ముతముల అశోక్రెడ్డి.. ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్నారు. తర్వాత.. టీడీపీలోకి వెళ్లారు. అదేసమయంలో అన్నా రాంబాబు.. వైసీపీ పంచన చేరి.. గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. అయితే.. ఇప్పుడు ఆయన వైఖరిపై .. తీవ్రస్థాయిలో అసంతృప్తి నెలకొంది. దీనికి తోడు.. అశోక్ దూకుడు పెంచారు. వైసీపీ నుంచి చేరికలను ఆహ్వాననిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతున్నారు. మరోవైపు అన్నా రాంబాబు.. కొందరికి మాత్రమే నాయకుడు అనే విధంగా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీంతో వైసీపీ రోజు రోజుకు ప్రభావం కోల్పోతోంది. పైగా రోజూ వైసీపీ నుంచి నాయకులు వచ్చి టీడీపీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా రాచర్ల మండలం అన్నం పల్లె గ్రామ పంచాయతీకి చెందిన వెంకటపతి నేతృత్వంలో పంచాయతీకి చెందిన 600 మంది వైసీపీ నేతలు కొత్త అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. క్షేత్రస్థాయిలో ఈ పరిణామాలు.. వైసీపీని తీవ్ర ఇరకాటంలోకి నెడుతున్నాయి. అంతేకాదు.. నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసినప్పటికీ కార్యకర్తలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని, పార్టీ కోసం శ్రమించి, కష్టపడి ఓట్లు వేయిస్తే కార్యకర్తలను మరవటంతో పాటు అభివృద్ధిని కూడా మరిచారు అని అన్నారు. మొత్తంగా చూస్తే.. గత ప్రాభవం ఇప్పుడు వైసీపీలో కనిపించడం లేదనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల వరకు ఉంటే.. ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ విజయం దక్కించుకుంటుందనే అంచనాలు కూడా వస్తున్నాయి. మరి అన్నా ఏం చేస్తారో చూడాలి.