సీమలోని నాలుగు జిల్లాలు.. కర్నూలు, కడపల్లో.. వైసీపీ పూర్తిగా అన్ని స్థానాలను దక్కించుకుంది. ఇక, చిత్తూరులో చంద్రబాబు ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. అనంతపురంలో రెండుస్థానాలు.. హిందూపురం.. ఉరవకొండ నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ ఖాతాలో పడ్డాయి. మిగిలిన అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముందస్తు ఎన్నికలు జరిగితే.. ఈ స్థానాలు కాకుండా.. టీడీపీ మరిన్ని దక్కించుకునే అవకావం ఉందా? లేక.. వైసీపీనే మొత్తం తన ఖాతాలో వేసుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది. రాజకీయ వర్గాల్లో ఈ విషయం ప్రధానంగా చర్చకు వస్తోంది.
నిజానికి సీమ ప్రాంతాన్ని తీసుకుంటే.. వైసీపీ నాయకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. పైగా ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల దూకుడు కూడా ఎక్కువగానే ఉంది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీని.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. అదేవిధంగా జిల్లాను అద్భుత నగరంగా తీర్చదిద్దే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మరోవైపు.. వైసీపీ బలగం ముందు.. టీడీపీ బలం సరిపోవడం లేదు. చాలా మంది కడప నేతలు.. బీజేపీ బాట పట్టారు. ఇది వ్యూహాత్మకంగా సాగినా.. తర్వాత.. బెడిసి కొట్టింది. మరి ఈ క్రమంలో కడపలో టీడీపీ పుంజుకోవడం కష్టమే.
ఇక, కర్నూలు విషయానికి వస్తే..ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా సాగుతున్నారు. పైగా వివాదాలు ఇప్పటికీ..పార్టీకి తలనొప్పిగా మారాయి. దీంతో ఇక్కడ కూడా ఈ సమస్యలు పరిష్కరిస్తే.. తప్ప.. పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. అనంతలోనూ.. వర్గపోరు ఎక్కువగానే ఉంది. జేసీ వర్గంలో ఎవరూ కలసి పనిచేయడం లేదు. అదేసమయంలో కాల్వ శ్రీనివాసులు కూడా తన మానాన తను పనిచేసుకుంటున్నారు. పరిటాల వర్గం కూడా ఒంటరిపోరుతోనే ముందుకు సాగుతోంది. ఇది కూడా ఇబ్బందే. ఇక, చిత్తూరులో కీలక నేతలు టీడీపీకి కరువయ్యారు. అయితే.. చిత్తూరులో కొంత చాన్స్ ఉన్నప్పటికీ.. కీలక నేతలు లేకపోవడం మైనస్గా మారింది. ఇలా ఎలా చూసుకున్నా.. మళ్లీ వైసీపీదే హవా అన్నట్టుగా ఉంది .. పరిస్థితి. మరి ఏం జరుగుతుందో చూడాలి.