ఏపీ రాజకీయాల్లో సి‌ఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారా? తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ మాదిరిగానే జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారా? అంటే ఏపీ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలని చూస్తుంటే విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు కావొస్తుంది. కానీ ఇప్పటి నుంచే నెక్స్ట్ ఎన్నికలకు జగన్, తమ పార్టీ శ్రేణులని సిద్ధం చేసేస్తున్నారు.

వచ్చే ఏడాది నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంని జగన్ రంగంలోకి దించేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, పార్టీ పనితీరుపై పీకే టీం సర్వే చేయనుంది. అలాగే వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయనుంది. అయితే నెక్స్ట్ ఏడాది నుంచే పీకే టీంని దించనుండటంతో... జగన్ ఏమన్నా ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానం రాక మానదు. తెలంగాణలో అలాగే సి‌ఎం కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి సక్సెస్ అయ్యారు.

ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉంది అనగా, కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళి, ప్రతిపక్షాలని కోలుకోలేని దెబ్బతీసి ఆ ఎన్నికల్లో విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే ప్లాన్‌తో జగన్ ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిపక్ష టి‌డి‌పిని ఏ మాత్రం పుంజుకొనివ్వకుండా ముందస్తుకు వెళ్ళి సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. ముందస్తుకు వెళ్ళడం వల్ల జగన్‌కు మంచి ఛాన్స్ ఒకటి ఉంటుంది.

ముందస్తులో గెలిచి అధికారంలోకి వస్తే...ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో జగన్‌కు ప్లస్ అవుతుంది. అప్పుడు జాతీయ రాజకీయాల్లో ఉన్న పరిస్తితులని బట్టి, జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎలాగో బి‌జే‌పికి సొంతంగా మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అలాంటప్పుడు బి‌జే‌పికి సపోర్ట్ ఇచ్చి, రాష్ట్రానికి కావాల్సిన పనులు సులువుగా చేయించుకోవచ్చు. చూడాలి మరి ముందస్తు ఎన్నికల విషయంలో జగన్ ప్లాన్ ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: