స్థానికంగా ఆరేళ్ళ పాపపై అక్కడే పని చేసుకుంటూ బ్రతుకుతున్న శ్రీను అనే వివాహితుడు అత్యాచారం చేసి చంపేసిన విషయం తెలిసిందే. అతడిని రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా వెతికి వేసరిపోగా, అతడి తలపై 10లక్షల బహుమతి కూడా ప్రకటించింది. అయినా దొరకకపోగా, హఠాత్తుగా ఒకరోజు ఆత్మహత్య పేరుతో రైల్వే పట్టాలపై అతడి శవం కనిపించడంతో అందరూ చల్లబడ్డారు. అయితే అక్కడే ఉన్న వ్యక్తి ఇదంతా చేస్తున్నప్పుడు ఎవరూ గమనించలేదా లేక అతడు ఇంత అఘాయిత్యం చేస్తాడేమో అనేది ఎవరూ ఊహించలేదా అనేది ఆలోచించాల్సిన అంశం.
మొత్తానికి ఘటన లో నిందితుడు మృతి చెందడంతో ఇదంతా ముగిసింది. కానీ, సమాజంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. మనిషిలో మార్పు కనిపించినప్పుడే ఆ మనిషిలో మృగం కనిపించకుండా ఉంటుంది. అక్కడ అంతమంది ఉన్నారు, చిన్నపిల్లపై ఒకడు ఏమి చేస్తున్నాడో గమనించ లేకపోయారా లేక మనకెందుకులే అని వెళ్లిపోయారా అనేది అక్కడి వారి విజ్ఞతకే వదిలేయాల్సిన సందర్భం. రానురాను మనిషి మృగం కంటే దారుణంగానే మారిపోతున్నాడు అనేదానికి ఇలాంటి ఘటనలు మచ్చుతునకలు. మనిషి తాను జీవిస్తున్న లోకంలో చుట్టూ గమనించుకుంటూ, తాను మనిషిలా ఉంటున్నానా అనేది నిత్యం గమనించుకుంటూనే ఉండాలి. అప్పుడే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉంటాయి. లేదంటే ఇక్కడ జరగకపోవచ్చు, మరెక్కడో జరుగుతూనే ఉంటాయి.