ఈ లెక్కింపులో భాగంగా ముందు బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున చేర్చి పెడతారు. అనంతరం ప్రతి పేపర్ ను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ ఉన్న ఆయా పార్టీల పరిశీలకులకు వాటిని చూపించి, లెక్కింపుకు సిద్ధం చేస్తారు. ముందుగా అన్నిటిని ఒక చోటుకు చేర్చుతారు. అనంతరం వాటిని పార్టీలకు అనుగుణంగా విభజించి, లెక్కింపుకు సిద్ధమవుతారు. ప్రతి బ్యాలెట్ పేపర్ అక్కడ ఉన్న ఏజెంట్ లకు చూపించి లెక్కింపుకు పనికివస్తుందనేది పరిశీలిస్తారు. ఒక్కోసారి బ్యాలెట్ పేపర్ పై రెండు సార్లు ఓటర్ స్టాంప్ వేస్తె అలాంటివి చెల్లనివిగా పరిగణిస్తారు. ఇలాంటివి పరిశీలించాల్సి వచ్చినప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న రిటర్నింగ్ అధికారి చేతిలో ఉంటుంది.
లెక్కింపు ఉదయం 8 నుండి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 206 లెక్కింపు కేంద్రాలలో 958 హాళ్లల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని జిల్లాలలో ఈ లెక్కింపులు పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమించింది ఎన్నికల సంఘం. ప్రతి కేంద్రంలో కూడా సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే 144 సెక్షన్ అమలుచేస్తున్నారు. మొత్తం 10047 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా, అందులో వివిధ కారణాల వలన 375 స్థానాలకు ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. మిగిలిన 9672 స్థానాలకు గాను 2371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 81 మంది ఇప్పటికే మృతి చెందారు. అంటే 7220 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీని కోసం 18782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 660జడ్పీటీసీ స్థానాలకు గాను 8 చోట్ల ఎన్నికలు వివిధ కారణాల వలన నిలిచిపోగా, 652 స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 126 స్థానాలు ఏకగ్రీవం కాగా, 11మంది మృతి చెందగా 515 స్థానాలకు ఎన్నిక జరిగింది. దీని కోసం 2058 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేటి మధ్యాహ్నానికి ఎంపీటీసీ, రాత్రికి జడ్పీటీసీ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.