అనుచిత వ్యాఖ్యల కారణంతో తీవ్ర వివాదాల్లో చిక్కుకుని, రేపో,మాపో అరెస్టు కానున్న మాజీ మంత్రి అయ్యన్న ఇకనైనా పద్ధతి మార్చుకుంటారా లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది. తాను చేసిన వ్యాఖ్యలపై అస్సలు పశ్చాత్తాపం ప్రకటించని ఆయన, ఇంకా అదే మార్గంలో ఉన్నారు. ఇంకొన్ని మాటలు, పెడ ధోరణలు వినిపిస్తున్నారు. విశాఖ రాజకీయాలతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నేత అ య్యన్న ఇప్పుడే కాదు గతంలోనూ అనేక సార్లు నోరు జారి తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కున్న దాఖలాలు ఉన్నాయి. అయినప్పటికీ పద్ధతి మార్చుకోకుండా అలానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
టీడీపీ హయాంలో వైసీపీ నాయకులు చాలా పద్ధతిగా ఉన్నారు. అలానే చంద్రబాబును ఏమీ అనలేదు. అలానే పద్ధతిగా రాజకీయాలు చేశాకనే పద్ధతిగా వాళ్లను, వీళ్లను తిట్టకుండా ఉన్నందుకే ఈ రోజు పద్ధతిగా అందరినీ ప్రశ్నించగలిగే స్థాయి వైసీపీ వచ్చిందనుకోవాలి. ఒక్కసారి టీడీపీ వైరల్ చేస్తున్న వైసీపీ నాయకుల బూతుల వీడియోలు చూస్తే ఆ రోజు వారెన్ని తప్పులు చేశారో ఈ రోజు వీరు కూడా అంతకు తగ్గని రీతిలో తప్పులు చేస్తూనే ఉన్నారు.
మొన్నటికి మొన్న జోగి రమేశ్, కొడాలి నాని, ధర్మాన కృష్ణ దాసు లాంగ్వేజ్ ఓ సారి వినండి. ఇంకా బాగుంటుంది. ఈ రెండు పార్టీలూ ఏ రోజూ తగ్గింది లేదు. ఎవరిని వారు నియంత్రించుకున్నది లేదు. అలాంటప్పుడు ఒకరికొకరు నీతులు చెప్పుకోవడం, సుద్దులు చెప్పుకోవడం అన్నవి తగని పనులు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నోటి దురుసుగా కారణంగా అనేక వివాదాలు రేగుతున్నాయి. సీఎం స్థాయి వ్యక్తిని దూషించిన ఘటన ఒకటి అన్ని మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది. కోడెల విగ్రహావిష్కరణలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై సొంత తమ్ముడు సన్యాసి పాత్రుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ నేతగా ఉన్నారు. ఇదే సందర్భంలో కొందరు వైసీపీ నేతలు సైతం అయ్యన్న వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అయ్యన్న వాదన ఇంకో విధంగా ఉంది. తాను తప్పేమీ మాట్లాడలేదు అని ఆయన చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఈ వివాదంలో పొలిటికల్ మైలేజ్ ను పొందేందుకు, పెంచేందుకు ఎవరికి వారు తాపత్రయ పడడమే ఆశ్చర్యకరం.