అయితే.. ఈ రెండు పార్టీల్లోనూ జగన్ ఏ పార్టీకి ఎక్కువ ప్రాదాన్యం ఇస్తున్నారు? అనేది వైసీపీలోను.. ఇటు టీడీపీ, బీజేపీల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణం.. ఇటీవల కాలంలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజులు ఇద్దరూ కూడా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ముఖ్యమంత్రి జగన్కు లేఖలు సంధిస్తున్నారు. ఇప్పటికి సోము వీర్రాజు.. 20కి పైగా లేఖలు సంధించారు. ఇక, ఇంచుమించు.. చంద్రబాబు కూడా ముఖ్యమంత్రికి, డీజీపీకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇంతే సంఖ్యలో లేఖలు రాశారు.
అయితే.. ఈ ఇద్దరు నాయకుల్లో జగన్.. చంద్రబాబు రాస్తున్న లేఖలను పట్టించుకోవడం లేదని.. టీడీపీ నేతలే గుసగుసలాడుతున్నారు. ఇక, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా ఈ లేఖలు బుట్టదాఖలు చేస్తున్నారు. తాజాగా పార్టీ నాయకుడు వర్ల రామయ్య ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తాము రాస్తున్న లేఖలను డీజీపీ బుట్టదాఖలు చేస్తున్నారు కనుకే.. తాము గవర్నర్ను ఆశ్రయించామని చెప్పుకొచ్చారు. సో.. టీడీపీ రాస్తున్న లేఖలను సీఎం జగన్ పక్కన పెట్టేస్తున్నారు. అసలు పట్టించుకోవడం కూడా లేదు. మరి.. బీజేపీ రాస్తున్న లేఖల సంగతేంటి?
ఇదే విషయంపై ఆసక్తి కర చర్చ సాగింది. సోము వీర్రాజు రాస్తున్న ప్రతి లేఖను సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూలంకషంగా చదువుతున్నారట. అంతేకాదు.. దీనిలో ప్రభుత్వం నిజంగా చేయాల్సింది ఏమైనా ఉంటే.. చేస్తున్నారట. ఇది బీజేపీలో జోష్ నింపుతోంది. మరి జగన్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ప్రజాబలం ఉన్న టీడీపీ రాసిన లేఖలకు స్పందిస్తే.. ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుందని.. పార్టీకి దన్నుగా మారుతుందని.. జగన్ భావిస్తున్నారు. అదే బీజేపీ అయితే.. ఎలాగూ ప్రజలు ఆ పార్టీని పట్టించుకోవడం లేదు కనుక తాను లేఖలకు స్పందించినా.. ఏమీ కాదని. వైసీపీకి డ్యామేజీ ఉండని అనుకుంటున్నారట. ఇదీ సంగతి..!