ఇటీవల కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా సభ విజయవంతం అయింది. దీంతో పాటు గతంలో నిర్వహించిన సభలకు భారీగా జనాలు వచ్చారు. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ హస్తం పార్టీ మరో అడుగు ముందుకు వేస్తోంది. ఈ సారి నిరుద్యోగులు, యువత కోసం పార్టీ పోరుసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిరుద్యోగ సమస్యపైన పోరు జరిపి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి చెప్పారు. `నిరుద్యోగ ధర్మ యుద్ధం` పేరుతో సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఈ సభను సీఎం కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల నుంచే ప్రారంభించబోతున్నట్టు కాంగ్రెస్ ప్రచార కమిటీ వైస్ చైర్మన్ అంజాతుల్లా తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగంపై యుద్దం చేసి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల్లో చైతన్యం నింపి అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పోరులో భాగంగా నిరుద్యోగులు, యువకులు, యూనివర్సిటీ మేధావులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ పోరులో భాగం కానున్నారు.