రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ మంచి ఫలితాలతో ఉత్సాహంతో ఉంది. ఇవన్నీ జగన్ పాలనకు రిఫరెండం అని చెప్పడంతో వైసీపీ ప్రభు భక్తి చాటుకుంది. పాలన ఎలా ఉన్నా అమ్మ ఒడి వస్తే చాలు అనుకునే జనాలు ఇంకా చాలా మంది ఉన్నారు. పాలన ఎలా ఉన్నా పింఛను ఆగకుంటే ఉంటే చాలు అని మొక్కుకున్న అవ్వాతాతలూ ఉన్నారు. విలేజ్ పాలిటిక్స్ గతంలో ఇలానే ఉన్నాయా అంటే ఉన్నాయి కొన్ని చోట్ల. అప్పుడు టీడీపీ ఇప్పుడు వైసీపీ అంతే తేడా! ఏం తేడా లేదు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోయాడనో లేదా మా శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు మాటకు విలువ లేకుండా పోయిందనో అనుకోవడం పెద్ద రిలీఫ్ వైసీపీకి. కానీ ఇప్పుడు జగన్ పాలనకు సంబంధించి ఎవ్వరన్నా చర్చకు తీసుకువస్తే...అసలు వివరం ఏంటన్నది తేలిపోనుంది.
ఇవి అసాధారణ ఫలితాలు. ఒంటి చేత్తో గెలిచేశాం. మా వైపు దేవుడున్నాడు. మాది దేవుడి పాలన అని అంటోంది వైసీపీ. నిజంగానే వైసీపీ పాలన అంత బాగుందా ? లేదా బాగుందన్న భ్రమ ఒకటి ప్రజలకు అందిస్తుందా? అదే జరిగితే అంతకుమించిన తప్పు ఇం కొకటి ఉండదు. ముఖ్యంగా శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో వైసీపీకి వచ్చిన ఓటు శాతం 64.19 శాతం. టీడీపీకి వచ్చిన ఓటు శాతం 26.30 శాతం. జనసేనకు వచ్చిన ఓటు శాతం 0.91 శాతం. వైసీపీ కి దీటుగా టీడీపీ మా జిల్లాలో లేదు. కాదనం కానీ వైసీపీ కి పోటీగా కూడా టీడీపీ మా జిల్లాలో లేదు. కొన్ని చోట్ల అస్సలు బలమైన అభ్యర్థుల ఎంపికే లేదు. ఇవన్నీ పరిగణిస్తే టీడీపీ పోటీ చేయకుండా ఎప్పుడో అస్త్రం వదిలేసింది. అలా వదిలేశాక కూడా వైసీపీకి వచ్చిన ఓటింగ్ ఇది. చాలా చోట్ల అభ్యర్థులంతా సరైన ప్రచారం కూడా చేయలేకపోయారు టీడీపీ అభ్యర్థులు. వైసీపీ అలా కాదు మంత్రులు కూడా ప్రచారం చేశారు. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే వరకూ సీన్ తీసుకువెళ్లారు. కొన్ని చోట్ల ఏక గ్రీవం వెనుక వైసీపీ చేసిన లాబీయింగ్ కూడా పనిచేసింది.
ఇవన్నీ టీడీపీ కి మైనస్. వైసీపీ ముఖ్యంగా పథకాల విషయమై చాలా ఆదేశాలు ఇచ్చేసింది. ఓటేయకుండా ఉంటే పథకాలు రావన్న మాట కూడా ప్రచారం చేసుకుంది. టీడీపీ కనీసం కొన్నిచోట్ల సమర్థ నాయకులనే పెట్టుకోలేకపోయింది.డబ్బులు బాగా ఉన్న అధికార పార్టీ ఈ సారి కూడా ఆ సూత్రాన్నే నమ్ముకుందని టీడీపీ అంటోంది. ఏదేమైనప్పటికీ గ్రామ స్థాయిలో వైసీపీ కి ఓటేయకుండా ఉంటే పింఛను ఆగిపోతుందనో, లేకా అమ్మ ఒడి రాదనో అన్న మాటైతే బాగానే జనంలోకి తీసుకువెళ్లారు.ఇవన్నీ ఎలా ఉన్నా వైసీపీ ఆశించిన దాని కన్నా ఎక్కువ సాధించింది. మా జిల్లాలో అచ్చెన్న కు ముచ్చెమటలు పోయించింది. సుదీర్ఘ కాలంగా తమ హవా నడిపి కళా వెంక్రటావుకు ఇప్పుడు గడ్డుకాలం వచ్చేసిందా అన్నట్లు ఫలితాలు వచ్చాయి. ఫలితాలు సరే పాలన మాటేంటి? అదే ఇప్పుడు ఆసక్తికరం.